‘సర్కారువారి పాట’లో విలన్‌గా సుదీప్‌?

12 Jun, 2020 15:00 IST|Sakshi

టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు హీరోగా ‘గీతగోవిందం’ ఫేమ్‌ పరశురామ్‌ దర్శకత్వంలో ‘సర్కారువారి పాట’ అనే చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. మైత్రీమూవీ మేకర్స్, 14 రీల్స్‌ ప్లస్, జీయంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై ఈ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రంలోని మహేశ్‌ ఫస్ట్‌ లుక్‌ సూపర్‌ స్టార్‌ కృష్ణ జన్మదినం సందర్భంగా మే 31న విడుదలైంది. ప్రస్తుతం మూవీ టైటిల్‌, మహేశ్‌ ఫస్ట్‌ లుక్‌ నెట్టింట్లో తెగ వైరల్‌ అవుతోంది. ఇక మహేశ్‌ కొత్త సినిమా గురించి అధికారిక ప్రకటన వెలువడినప్పటినుంచి ఏదో ఒక వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. (మహేశ్‌ సర్‌ప్రైజ్‌ వచ్చింది.. ట్రెండింగ్‌లో టైటిల్‌)

సినిమా కథ ఇదేనంటూ, హీరోయిన్‌ కియారా అద్వానీ అంటూ పలు ముచ్చట్లు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికర విషయం ఫిలింనగర్‌ సర్కిళ్లలో వినిపిస్తోంది. ‘సర్కారువారి పాట’చిత్రంలో హీరో మహేశ్‌ను ఢీ కొట్టబోయే విలన్‌గా కన్నడ స్టార్‌ సుదీప్‌ను చిత్రబృందం ఫైనల్‌ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో విలన్‌ పాత్రకు ఎంతో ప్రాముఖ్యం ఉందని, ఆ పాత్రకు సుదీప్‌ అయితేనే బాగుంటుందని పరుశురామ్‌ భావించాడని, ఇప్పటికే అతడికి కథ కూడా వినిపించాడని తెలుస్తోంది. ఇక ‘ఈగ’ సినిమాతో సుదీప్‌ తెలుగు అభిమానులకు సుపరిచితమే. ఇటీవలే దబాంగ్‌-3 చిత్రంలోనూ నెగటీవ్‌ రోల్‌ చేసి ఆకట్టుకున్నాడు.  

అయితే ఈ విషయంపై చిత్ర బృందం నుంచి గాని సుదీప్‌ నుంచి గాని ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇక లాక్‌డైన్‌ కారణంగా సినిమా షూటింగ్‌ ఆలస్యంగా ప్రారంభం కానున్న నేపథ్యంలో పాటలను ఫైనలైజ్‌ చేసే పనిలో చిత్రబృందం ఉన్నట్లు సమాచారం. అలాగే షూటింగ్‌కు అనుమతులు లభించిన వెంటనే చిత్రీకరణ స్టార్ట్‌ చేసేందుకు ఓ సెట్‌ను సిద్ధంగా ఉంచాలనే ఆలోచనలో ఉన్నారు టీమ్‌. ఇక బ్యాంకు మోసాల బ్యాక్‌డ్రాప్‌లో సాగే రివెంజ్‌ డ్రామాయే ఈ చిత్రం అని, ఓ బ్యాంకు మేనేజర్‌ కొడుకుగా మహేశ్‌ పాత్ర ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. (26 ఏళ్ల వయసులో ఆమెను ఇష్టపడ్డాను)

మరిన్ని వార్తలు