'నిన్ను చూసి గర్వపడుతున్నాం'

30 Apr, 2016 18:14 IST|Sakshi
'నిన్ను చూసి గర్వపడుతున్నాం'

సాధారణంగా తెలుగు సినిమాల్లో ఎక్కువశాతం పరభాషా నటులు విలన్లుగా దర్శనమిస్తుంటారు. అచ్చంగా అలానే పరభాషా చిత్రంలో మన తెలుగు నటుడు విలన్ గా నటించి సత్తా చాటాడు. దాంతో ప్రస్తుతం అతడు 'టాక్ ఆఫ్ ద టాలీవుడ్' అయ్యాడు. తెలుగు యువ హీరో సుధీర్ బాబు తొలిసారి బాలీవుడ్ మూవీ 'భాగీ' లో నెగటివ్ రోల్ లో నటించి అందరి మన్ననలు అందుకుంటున్నాడు. సుధీర్ అభినయానికి తోటి నటీనటుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. రెజీనా, రకుల్ ప్రీత్ సింగ్, మంచులక్ష్మీ, సందీప్ కిషన్, రాహుల్ రవీంద్రన్, ఆండీ శ్రీనివాసన్లు సధీర్ బాబుతో కలిసి భాగీని వీక్షించారు. 'సుధీర్ బాబు నిన్ను చూసి గర్వపడుతున్నాము. భాగీలో నీ నటన అద్భుతం. నీతో కలిసి భాగీని థియేటర్ లో చూడటం ఎంతో ఆనందాన్నిచ్చింది' అని మంచు లక్ష్మి ట్వీట్ చేశారు.  


టైగర్ ష్రాఫ్, శ్రద్ధాకపూర్ లు హీరో హీరోయిన్ లుగా నటించిన భాగీ చిత్రంలో విలన్ రోల్ లో సుధీర్ బాబు అలరించారు. శుక్రవారం విడుదలైన భాగీ ఈ ఏడాది విడుదలైన బాలీవుడ్ సినిమాల్లో అత్యధిక ఓపెనింగ్ కలెక్షన్లు సాధించిన మూడో చిత్రంగా నిలిచింది. షబ్బీర్ ఖాన్ దర్శకత్వంలో సాజిద్ నడియాడ్వాలా ఈ సినిమాను నిర్మించారు. దేశవ్యాప్తంగా 2750 స్రీన్లలో ఈ సినిమా విడుదలైంది. కాగా సినిమాకు విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది.