పచ్చడి తిని ఆఫీసుకెళ్లారు

18 Jun, 2019 03:12 IST|Sakshi
మణిరత్నం

ప్రముఖ దర్శకుడు మణిరత్నం ఆరోగ్యం విషయంలో అడపా దడపా అభిమానులు షాక్‌కి గురయ్యే వార్తలు బయటికొస్తుంటాయి. తాజాగా ఆయన చెనై్నలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చేరారనే వార్త ఫ్యాన్స్‌ని కలవరానికి గురి చేసింది. గత ఏడాది మణిరత్నంకు గుండె పోటు వచ్చిన విషయం తెలిసిందే. చికిత్స తీసుకున్న ఆయన కోలుకున్నారు. ఇప్పుడు భారీ మల్టీస్టారర్‌ చిత్రం ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ పనుల్లో ఉన్న మణి ఆస్పత్రిలో చేరారని వార్త రావడంతో ఏమై ఉంటుంది? అనే చర్చలు మొదలయ్యాయి. అయితే ‘ఆల్‌ ఈజ్‌ వెల్‌’ అని స్పష్టం చేశారు మణిరత్నం సతీమణి, నటి సుహాసిని.

‘‘నా భర్త ఈ రోజు (సోమవారం) ఉదయం పని చేయడానికి వెళ్లారు. ‘నామ్‌ ఉమన్‌’ ట్రస్ట్‌ కోసం మా ఇంట్లో వర్క్‌షాప్‌ ఏర్పాటు చేశాను. ట్రస్ట్‌ కోచ్‌ రూపా రోటీలు, మామిడికాయ పచ్చడి తీసుకొస్తే, ఆయన ఇష్టంగా తిని, స్క్రిప్ట్‌లో మరింత స్పైస్‌ యాడ్‌ చేయడం కోసం ఆఫీస్‌కి వెళ్లారు’’ అని సుహాసినీ మణిరత్నం తెలిపారు. ఇక ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ విషయానికి వస్తే.. ప్రముఖ తమిళ నవల ఆధారంగా రూపొందనున్న ఈ చిత్రంలో మోహన్‌బాబు, ఐశ్వర్యా రాయ్, అనుష్క, శింబు, కార్తీ, కీర్తీ సురేష్‌.. ఇలా పలువురు ప్రముఖ తారలు నటించనున్నారని సమాచారం. నటీనటుల గురించి ఇంకా మణిరత్నం అధికారికంగా ప్రకటించలేదు.

మరిన్ని వార్తలు