నేను నటినయ్యింది ఇప్పుడే

13 Jan, 2016 02:53 IST|Sakshi
నేను నటినయ్యింది ఇప్పుడే

తాను నటినయ్యింది ఇప్పుడే అంటోంది రకుల్‌ప్రీత్ సింగ్. ఏమిటీ ఆశ్చర్యపోతున్నారా? అలాంటి మాటల గారడీలతో ఆసక్తిని రేకెత్తించడం తారామణులకు అలవాటే. ఇందుకు నటి రకుల్‌ప్రీత్ మినహాయింపేమీ కాదు. తమిళంలో ఎన్నమో ఏదో,తడైయారతాక్క తదితర చిత్రాలలో నటించిన ఈ ఉత్తరాది బ్యూటీని కోలీవుడ్ పెద్దగా పట్టించుకోలేదు. దీంతో టాలీవుడ్‌కు మకాం మార్చింది. అయితే అక్కడ అమ్మడికి అదృష్టం అనూహ్యంగా తలుపుతట్టింది.
 
  యువ హీరోల నుంచి స్టార్ హీరోల వరకూ ఇప్పుడు రకుల్‌నే తమకు జంటగా కోరుకుంటున్నారు. రామ్‌చరణ్, అల్లుఅర్జున్, జూనియర్ ఎన్టీఆర్‌లతో నటించే స్థాయికి రకుల్‌ప్రీత్ ఎదిగింది. అంతే కాదు తన కొంగొత్త అందాలతో కాజల్ అగర్వాల్, తమన్న, సమంత వంటి ప్రముఖ నటీమణులకు పోటీగా తయారైంది. విషయం ఏమిటంటే తాను ఇప్పుడే నటినయ్యానని రకుల్ పేర్కొని షాక్ ఇచ్చింది. అయితే దాని గురించి తను వివరిస్తూ తానిప్పటి వరకూ గ్లామరస్ పాత్రల్లో దర్శకుల సూచనలను తూచా తప్పకుండా పాటిస్తూ నటించానని చెప్పింది.
 
అలా ఇప్పటి వరకూ ఒక సరాసరి కథానాయకిగా నటించిన తాను తెలుగు చిత్రం నాన్నకు ప్రేమతో చిత్రంతోనే నటినయ్యానని పేర్కొంది. ఆ చిత్రంలో నటించమని దర్శకుడు సుకుమార్ తన వద్దకు వచ్చినప్పుడు ఇదీ మీ పాత్ర, మీరు ఎంత సహజంగా నటిస్తారో అదే నాకు కావాలి అని అన్నారని తెలిపింది. నటన అనే భావనను మరచి ఆ చిత్రంలోని నాయకి పాత్రను తనకు అన్వయించుకుని పోషించానని చెప్పుకొచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా బుధవారం తెరపైకి రానుంది.