అమ్మ , నేను ఒకే స్కూల్లో చదివాం: సుమన్

12 Dec, 2016 14:48 IST|Sakshi
అమ్మ , నేను ఒకే స్కూల్లో చదివాం: సుమన్

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతి పట్ల సీనియర్ నటుడు సుమన్ దిగ్భాంతి వ్యక్తం చేశారు. హాస్పిటల్ నుండి పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తుందని భావించాం, కానీ ఇలా జరిగటం బాధాకరం అన్నారు. ఆమె, నేను చెన్నైలోని చర్చ్ పార్క్ స్కూల్లో చదివాం. నేను థర్డ్ స్టాండర్డ్ చదువుతున్నపుడు జయలలిత సీనియర్. ఆమె షూటింగ్లకు వెళ్ళడం నాకు  బాగా గుర్తుంది అని సుమన్ గుర్తుచేసుకున్నారు.

నటిగా కంటే మంచి డాన్సర్గా జయలలిత మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకున్నా పాలిటిక్స్ లోకి వచ్చి సక్సెస్ అయ్యారు. ఈ క్రమంలో అవమానాలు ఎదురైనా తట్టుకుని నిలబడి జనామోదం పొంది మాస్ లీడర్ అయ్యారు. పేద ప్రజలకు విశేష సేవలందించి అమ్మగా పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా అమ్మ క్యాంటిన్ ఆమెకు పేద ప్రజల గుండెల్లో చెరగని స్థానం సంపాదించి పెట్టింది. అని ఆమె సినీ రాజకీయ ప్రస్థానాలను గుర్తు చేసుకున్నారు సుమన్.

జయ మరణం జీర్ణించుకోలేకపోతున్నా- నటి జమున

సోదరి జయలలిత మరణ వార్తను జీర్ణించుకోలేకపోతున్నానని సినీనటి జమున అన్నారు. జయలలిత శపథం మంగమ్మ శపథం లాంటిదన్నారు. ఐదు సార్లు సీఎంగా చేసిన మహా నాయకురాలు అని, పేదల హృదయాల్లో అమ్మగా నిలిచిపోయారని కొనియాడారు. జయ టీవీ సిల్వర్ జూబ్లీ ఉత్సవాల అనంతరం ప్రేమగా తమకు జయలలిత వడ్డించారని, కౌగిలించుకుని కొత్త బట్టలు పెట్టి పంపించారని జమున గుర్తు చేసుకున్నారు.