ఖమ్మంలో ‘ప్రేమిస్తే ప్రాణం తీస్తారా?’ 

22 Jan, 2019 14:51 IST|Sakshi
సుమన్‌శెట్టి, సిరిల మధ్య సన్నివేశం, సన్నివేశంలో కోటా శంకర్‌రావు

సాక్షి, ఖమ్మం మయూరి సెంటర్‌: సిరి క్రియేషన్స్‌ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ‘ప్రేమిస్తే ప్రాణం తీస్తారా? చిత్ర బృందం సోమవారం నగరంలో సందడి చేశారు. చిత్ర యూనిట్‌ సభ్యులు ఖమ్మం నగరంలో సినిమా చిత్రీకరణ ప్రారంభించారు. సిరి, షాలిని, ఇమ్రాన్, హరి హీరో, హీరోయిన్లుగా నటిస్తుండగా, ప్రముఖ సినీ నటులు కోటా శంకర్‌రావు, నామాల మూర్తి, సుమన్‌శెట్టి, పటాస్‌ ప్రకాశ్, జబర్దస్త్‌ నటులు చిత్రంలో నటిస్తున్నట్లు దర్శకుడు సమిర్‌నాని తెలిపారు. ఖమ్మం, పాలేరు, కిన్నెరసాని, భద్రాచలం పరిసర ప్రాంతాల్లో సినిమాకు అవసరమైన ప్రదేశాలు ఉన్నాయని, షూటింగ్‌కు అనూకూలమైన వాతావరణం ఉందని తెలిపారు.

ప్రస్తుత సమాజంలో జరుగుతున్న పరువు హత్యల నేపథ్యంలో ప్రేమిస్తే ప్రాణం తీస్తారా? సినిమాను తెరకెక్కిస్తున్నామని పేర్కొన్నారు. సోమవారం ఖమ్మంలో పలు సన్నివేశాలను చిత్రికరించినట్లు తెలిపారు. ఈ సినిమాకు కెమెరామెన్‌గా శివరాథోడ్, సంగీత దర్శకుడిగా ఏఆర్‌ సన్నీ, ఎడిటర్‌గా సుబ్రహ్మణ్యరాజు, అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా సరిత కనపత్తి, కోడైరెక్టర్‌గా దిలీప్‌ రామగిరి వ్యవహరిస్తున్నట్లు చెప్పారు. చిత్రానికి సంబంధించిన ఆడియో ఫిబ్రవరి మొదటి వారంలో జీవీకే–4 ద్వారా విడుదలవుతుందని వివరించారు. 

మరిన్ని వార్తలు