బిగ్‌బాస్‌ షో: హీరోయిన్‌కు సమన్లు

13 Aug, 2017 13:03 IST|Sakshi
బిగ్‌బాస్‌ షో: హీరోయిన్‌కు సమన్లు

చెన్నై: మలయాళ హీరోయిన్‌ ఓవియ ఆత్మహత్యాయత్నం విచారణకు సంబంధించి పోలీసులు ఆమెకు శనివారం సమన్లు పంపారు. తమిళంలో ప్రసారం అవుతున్న బిగ్‌బాస్‌ కార్యక్రమంలో పాల్గొన్న నటి ఓవియ ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పూందమల్లి నజరత్‌పేట పోలీసులకు ఓ సామాజిక కార్యకర్త ఫిర్యాదు చేశారు. 'బిగ్‌బాస్‌'లో పాల్గొన్న ఇతర సభ్యుల కారణంగా నటి ఓవియ ఈత కొలనులో దూకి ఆత్మహత్యాయత్నం చేశారని, దీనిపై తగిన విచారణ జరపాలని కోరారు.

ఇదివరకే ఈ విషయంపై ఫిర్యాదులు రావడంతో నజరత్‌ పేట పోలీసు ఇన్‌స్పెక్టర్‌ జయచంద్రన్ బిగ్‌బాస్‌ ఇంటిలోకి వెళ్లి విచారణ జరిపారు. ఓవియ నేరుగా విచారణకు హాజరు కావాలంటూ సమన్లు పంపినట్లు ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు. తాను ఆత్మహత్యాయత్నం లాంటివి చేయలేదన్నట్లు ఇతర కంటెస్టెంట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. మరోవైపు ఓవియ తీవ్ర అస్వస్థతకు గురి అవడంతో అర్థాంతరంగా షో నుంచి వెళ్లిపోయారు. నటి తన సొంత ఊరైన కొచ్చిన్‌ లో ఉంటున్నారు. అక్కడ మానసిక చికిత్స చేయించుకుంటున్నట్లు సామాజిక మాధ్యమాలలో ఫొటోలు వైరల్‌ అయ్యాయి.

కాగా తమిళ బిగ్‌బాస్‌కు ప్రముఖ నటుడు కమల్ హాసన్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. షోలో పాల్గొన్న వారి చర్యలు తమిళనాట చర్చనీయాంశంగా మారాయి. గాయత్రి రఘురాం స్లమ్‌ కల్చర్‌ వంటి పదాలను వాడటం వివాదాస్పదంగా మారింది. మరోవైపు స్టార్ హీరో ఎన్టీఆర్ హోస్ట్‌గా చేస్తున్న తెలుగు బిగ్‌బాస్ విజయవంతంగా కొనసాగుతోంది.