యువరాణి అయ్యే అవకాశం నటి హన్సికకు దక్కనుందా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానం కోలీవుడ్ నుంచి వస్తోంది. కోలీవుడ్లో విజయ్, విశాల్, ధనుష్, జయంరవి, ఆర్య వంటి యువ స్టార్స్ అందరితోనూ నటించిన ఈ ఉత్తరాది బ్యూటీకి తాజాగా ఇక్కడ ఒక్క అవకాశం కూడా లేకపోవడం గమనార్హం. తెలుగులో కూడా ఒకే ఒక్క చిత్రం చేతిలో ఉంది. ఒకప్పుడు చేతి నిండా చిత్రాలతో యమా బిజీగా ఉన్న హన్సికకు ఇలాంటి పరిస్థితి వస్తుందని తను కూడా ఊహించి ఉండి ఉండదు.
అయితే ఇలాంటి పరిస్థితి హన్సికకే కాదు చాలా మంది ప్రముఖ కథానాయికలు ఎదుర్కొన్నారు. తమన్నా లాంటి నటికి కూడా బాహుబలి చిత్రానికి ముందు ఇదే పరిస్థితి. ఒక బ్రహ్మాండ చారిత్రక చిత్రంలో నటించే అవకాశం హన్సిక తలుపు తట్టనుందనే ప్రచారం కోలీవుడ్లో జోరందుకుంది. అదేవిటన్నది చాలా మందికి అర్థం అయ్యే ఉంటుంది. ఎస్ నటి శ్రుతీహాసన్ వదులుకున్న యువరాణి అవకాశాన్ని హన్సిక చేజిక్కించుకోనుందట. సుందర్.సీ.దర్శకత్వంలో శ్రీతేనాండాళ్ ఫిలింస్ సంస్థ సంఘమిత్ర చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చారిత్రాత్మక భారీ చిత్రంలో నటించనున్న నటీనటుల పట్టిక మారిపోతోంది. మొదట ఇందులో అజిత్ను కథానాయకుడిగా నటింపజేయాలనే ప్రయత్నాలు జరిగాయి.
ఆయన సుముఖత చూపలేదు.దీంతో విజయ్ నటించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరిగింది. దాదాపు రెండేళ్ల చిత్ర నిర్మాణం జరిగే సంఘమిత్ర చిత్రానికి అన్ని కాల్షీట్స్ కేటాయించలేని విజయ్ ఆ చిత్రాన్ని టచ్ చేయలేకపోయారు. ఎట్టకేలకు నటుడు జయంరవి, ఆర్య కథానాయకులుగా నటించడానికి ముందుకొచ్చారు. ఇక కథానాయకిగా యువరాణి పాత్రను పోషించడానికి సంచలన నటి శ్రుతీహాసన్ ఎంపికయ్యారు. అంతా ఓకే అనుకుంటున్న సమయంలో ఆ బ్యూటీ హఠాత్తుగా సంఘమిత్ర నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి చిత్ర యూనిట్నే కాదు ఆమె అభిమానులకు షాక్ ఇచ్చారు. ఇప్పుడా పాత్రలో దర్శకుడు సుందర్.సీ ఫేవరేట్ నటి హన్సికను ఎంపిక చేసే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నట్లు తాజా సమాచారం.