ఆయన చిత్రాలు నేచురల్‌గా ఉంటాయి - సందీప్ కిషన్

9 Nov, 2016 22:47 IST|Sakshi
ఆయన చిత్రాలు నేచురల్‌గా ఉంటాయి - సందీప్ కిషన్

‘‘నా స్నేహితుడు, శ్రేయోభిలాషి చక్రి నిర్మిస్తున్న చిత్రంలో నటిస్తుండటం హ్యాపీగా ఉంది. కృష్ణవంశీ వంటి గొప్ప డెరైక్టర్‌తో పనిచేస్తున్న టైమ్‌లోనే సుశీంద్రన్‌గారి దర్శకత్వంలో నటించే ఛాన్స్ రావడం నా అదృష్టం’’ అని హీరో సందీప్ కిషన్ అన్నారు. తమిళ దర్శకుడు సుశీంద్రన్  దర్శకత్వంలో సందీప్ కిషన్, మెహరీన్ జంటగా లక్ష్మీ నరసింహ ఎంటర్‌టైన్ మెంట్స్ పతాకంపై చక్రి చిగురుపాటి నిర్మిస్తున్న కొత్త చిత్రం హైదరా బాద్‌లో ప్రారంభమైంది.

సూపర్ స్టార్ కృష్ణ కూతురు మంజుల స్క్రిప్ట్‌ను చిత్ర బృందానికి ఇవ్వగా, నిర్మాత పి. కిరణ్ కెమెరా స్విచ్చాన్ చేశారు. మరో నిర్మాత ఎ.యం.రత్నం క్లాప్ ఇవ్వగా, ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ గౌరవ దర్శకత్వం వహించారు. సందీప్ కిషన్ మాట్లాడుతూ- ‘‘యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న చిత్రమిది. సుశీంద్రన్ గారి చిత్రాలు చాలా నేచురల్‌గా ఉంటాయి.

ఆయన తీసిన ‘నా పేరు శివ’కి నేను పెద్ద ఫ్యాన్‌ని. ముచ్చటగా మూడోసారి తమన్‌తో పని చేయడం సంతోషాన్నిస్తోంది’’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కనున్న చిత్రమిది. డిసెంబర్‌లో రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టి, జనవరి, ఫిబ్రవరిలో పూర్తి చేస్తాం. ఏప్రిల్ లేదా మేలో సినిమా రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ‘‘కృష్ణగాడి వీరప్రేమగాథ’ తర్వాత తెలుగులో నా రెండో చిత్రమిది. ఈ చిత్రంతోనే తమిళ ఇండస్ట్రీకి కూడా పరిచయం అవుతుండటం నా లక్’’ అని మెహరీన్ అన్నారు.

>