ప్రేక్షకులు నవ్వుతుండటం సంతోషం

16 Nov, 2019 04:54 IST|Sakshi
‘తెనాలి రామకృష్ణ బీఏబీఎల్‌’ చిత్రబృందం

‘‘తెనాలి రామకృష్ణ బీఏబీఎల్‌’ సినిమాని ప్రేక్షకులను నవ్వించడానికే తీశామని ముందు నుంచి చెబుతున్నాం. మా సినిమాపై వస్తున్న రివ్యూలను స్వాగతిస్తున్నా’’ అని హీరో సందీప్‌ కిషన్‌ అన్నారు. జి.నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో సందీప్‌ కిషన్, హన్సిక జంటగా నటించిన చిత్రం ‘తెనాలి రామకృష్ణ బీఏబీఎల్‌’. జవ్వాజి రామాంజనేయులు సమర్పణలో అగ్రహారం నాగిరెడ్డి, శ్రీనివాస్, కె.సంజీవ్‌ రెడ్డి నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సక్సెస్‌ మీట్‌లో సందీప్‌ కిషన్‌ మాట్లాడుతూ– ‘‘నాకు వస్తున్న ఫోన్‌ కాల్స్‌ని బట్టి మా చిత్రాన్ని ప్రేక్షకులు బాగా ఎంజాయ్‌ చేస్తున్నారని తెలుస్తోంది.

ఎక్కడా బోర్‌ కొట్టకుండా ఉందంటున్నారు. ప్రతి షోకు జనాలు పెరుగుతున్నారు’’ అన్నారు. ‘‘నవ్వించడానికి సినిమా తీశాం.. ప్రేక్షకులు నవ్వుతుండటం సంతోషం. కామెడీ, మ్యూజిక్, ట్విస్ట్‌లు బావున్నాయని అంటున్నారు.. మాకు అదే చాలు. అందరం సంతోషంగా ఉన్నాం’’అన్నారు దర్శకుడు జి.నాగేశ్వర రెడ్డి. ‘‘అన్ని ఏరియాల నుంచి పాజిటివ్‌ టాక్‌  వస్తోంది’’ అన్నారు నిర్మాతలు. ‘‘మేము హిట్‌ కొట్టాం అని గర్వంగా చెబుతున్నాను. ఆడియన్స్‌కు ధన్యవాదాలు’’ అన్నారు ఎడిటర్‌ చోటా కె. ప్రసాద్‌. ‘‘మార్నింగ్‌ షో నుంచి పాజిటివ్‌ టాక్‌ వినిపిస్తోంది. ఈ సినిమాకు పనిచేసిన అందరికీ అభినందనలు’’ అన్నారు సంగీత దర్శకుడు సాయి కార్తీక్‌.
 

మరిన్ని వార్తలు