‘నేనైతే వాళ్ల గురించి అసలే పట్టించుకోను’

13 May, 2019 20:44 IST|Sakshi

ఒక ఐఏఎస్‌ పిల్లలు ఐఏఎస్‌లుగా అవ్వగా లేని అభ్యంతరం.. నటుల పిల్లలు సినిమాల్లోకి వస్తే మాత్రం ఎందుకు ఉంటుందని బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి ప్రశ్నించాడు. భాష ఏదైనా ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ మొత్తంలో నటుల వారసులు తెరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సునీల్‌ శెట్టి కూతురు అతియా ఇప్పటికే హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వగా.. కొడుకు అహాన్‌ శెట్టి కూడా త్వరలోనే బిగ్‌స్క్రీన్‌పై కనిపించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇక కాఫీ విత్‌ కరణ్‌ షోలో నెపోటిజమ్‌(బంధుప్రీతి) గురించి ఫైర్‌బ్రాండ్‌ కంగనా ప్రస్తావించిన నాటి నుంచి సోషల్‌ మీడియాలో రచ్చ అవుతున్న సంగతి తెలిసిందే. స్టార్‌ కిడ్స్‌ లక్ష్యంగా కొంతమంది ట్రోలింగ్‌కు దిగుతున్నారు.

ఈ విషయం గురించి సునీల్‌ శెట్టి మాట్లాడుతూ.. ‘ ఓ ఐఏఎస్‌ ఆఫీసర్‌ తన పిల్లలను తనలాగే అవ్వాలని కోరుకుంటాడు. దానిని ఎవరూ తప్పు పట్టరు. కానీ ఒక నటుడు, నటి పిల్లలు మాత్రం తల్లిదండ్రుల బాటలో నడవాలనుకుంటే మాత్రం ఎక్కడా లేని నెగిటివిటి చూపిస్తారు. నిజానికి వారసులకు ఎంట్రీ సులభంగా ఉంటుందేమో గానీ, మొదటి శుక్రవారం తర్వాత వాళ్ల ప్రతిభను నిరూపించుకుంటేనే కెరీర్‌లో నిలదొక్కుకుంటారు. కానీ కొంతమంది మాత్రం వారసులంటూ స్టార్‌ కిడ్స్‌పై అకారణ ద్వేషం పెంచుకుంటారు. ఇక జీవితంపై విరక్తి చెందిన వారు, సంతోషం లేని వారు తమ విసుగునంతా తెచ్చి సోషల్‌ మీడియాలో ప్రదర్శిస్తారు. ఊహా లోకంలో జీవిస్తూ ఎదుటి వారిపై అక్కసు వెళ్లగక్కేకంటే నిజ జీవితంలో అందరం కలివిడిగా ఉండటం ఉత్తమం. అయినా ద్వేషపూరిత మనస్తత్త్వం కలిగిన వారి గురించి నేనైతే అస్సలు పట్టించుకోను. నన్ను మా నాన్నా ఎలా పెంచాడో నేను కూడా నా పిల్లల విషయంలో అలాగే ఉన్నాను. వారిద్దరు తమ కెరీర్‌లో సొంతంగా నిర్ణయాలు తీసుకోగలిగేలా తీర్చిదిద్దాను’ అని పేర్కొన్నాడు

మరిన్ని వార్తలు