సమ్మర్‌లో సందడి

19 Mar, 2017 02:58 IST|Sakshi
సమ్మర్‌లో సందడి

సమ్మర్‌లో థియేటర్‌కి వచ్చేవారికి నవ్వులు గ్యారంటీ అంటున్నారు సునీల్‌. ‘ఉంగరాల రాంబాబు’గా ఆయన టైటిల్‌ రోల్‌ చేసిన చిత్రం సమ్మర్‌లో రీలీజ్‌ కానుంది. క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో పరుచూరి కిరీటి ఈ చిత్రాన్ని నిర్మించారు. మియా జార్జ్‌ కథానాయిక.  ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. నిర్మాత మాట్లాడుతూ – ‘‘ప్రేక్షకులను హాయిగా నవ్వించాలనే లక్ష్యంతో తీసిన సినిమా ఇది. అలాగని కథకు పొంతన లేని కామెడీ పెట్టలేదు.

 కామెడీ కథలో భాగంగానే ఉంటుంది. ‘ఓనమాలు’, ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ వంటి హృదయానికి హత్తుకునే సినిమాలు తీసిన క్రాంతి మాధవ్‌ తనదైన మార్క్‌తో సునీల్‌ తరహా కామెడీతో ఈ సినిమాని తెరకెక్కించారు. ఉంగరాల రాంబాబుగా సునీల్‌ పర్ఫార్మెన్స్‌ అందరినీ అలరించే విధంగా ఉంటుంది. ఇందులో సునీల్‌ క్యారెక్టరైజేషన్‌ ఇప్పటివరకూ ఆయన చేసిన లీడ్‌ రోల్స్‌ కన్నా భిన్నంగా ఉంటుంది.

 ప్రకాశ్‌రాజ్, పోసాని, రావు రమేశ్‌ తదితరుల పాత్రలు ఆసక్తికరంగా ఉంటాయి. జిబ్రాన్‌ మంచి పాటలు ఇచ్చారు. త్వరలో టీజర్‌ను, పాటలను విడుదల చేయాలనుకుంటున్నాం. వేసవిలోనే చిత్రాన్ని విడుదల చేయనున్నాం’’ అన్నారు.