రీల్‌ సునీల్‌ దత్‌కు రియల్‌ సునీల్‌ రాసిన చివరి లేఖ

10 Jul, 2018 10:02 IST|Sakshi

ముంబై : బాలీవుడ్‌ స్టార్‌ సంజయ్‌ దత్‌ జీవితగాథ ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘సంజు’. ఇందులో సంజయ్‌ దత్‌గా రణ్‌బీర్‌ కపూర్‌, తండ్రి సునీల్‌ దత్‌గా పరేష్‌ రావెల్‌ నటించారు. సినిమా విడుదలై బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ సందర్భంగా పరేష్‌ రావెల్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. గతంలో తనకు సునీల్‌ దత్‌ రాసిన లేఖ గురించి ప్రస్తావించారు. సునీల్‌ దత్‌ చనిపోయే కొద్ది రోజుల ముందు పరేష్‌కు ఓ లేఖ రాశారు. అతను చనిపోయిన రోజు తనకు ఆ లేఖ గురించి తెలిసిందని పరేష్‌ సునీల్‌ దత్‌తో ఉన్న అనుబంధాన్ని నెమరేసుకున్నారు. 

‘మే 25, 2005న.. నేను ఓ సినిమా షూటింగ్ లో ఉన్నాను. అదే సమయంలో సునీల్ దత్ స్వర్గస్తులయ్యారని తెలిసింది.  సునీల్ నివాసానికి వెళుతున్నా, రాత్రి ఇంటికి రావడం ఆలస్యమవుతుందని నా భార్యకు ఫోన్ చేసి చెప్పాను. సునీల్ దత్ నుంచి మీకో ఉత్తరం వచ్చిందని నా భార్య నాకు చెప్పింది. అందులో ఏం రాసుందని అడిగాను.

‘ డియర్‌ పరేష్‌ జీ మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు,  జీవితాంతం సుఖంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీరు, మీ కుటుంబ సంభ్యులు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్ధిస్తున్నాను’  అని రాసి ఉందని నా భార్య సమాధానమిచ్చింది. నా పుట్టిన రోజు మే 30న కానీ ఐదు రోజు ముందుగానే సునీల్‌ నాకు శుభాకాంక్షలు తెలియజేస్తూ లేఖ రాశారు. సునీల్ జీ, నేను పండగల సమయంలో కూడా ఒకరికొకరం శుభాకాంక్షలు చెప్పుకోం. ఆయన చనిపోవడానికి ముందు ఈ లేఖ నాకు రాయడం ఆశ్చర్యానికి గురిచేసింది’  అని పరేష్‌ రావెల్‌ చెప్పుకొచ్చారు.

రాజ్‌కుమార్‌ హిరాణీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రణ్‌బీర్‌ కపూర్‌, పరేష్‌ రావెల్‌, మనీషా కోయిరాల, అనుష్క శర్మ, దియా మీర్జా, విక్కీ కౌశల్‌ తదితరులు నటించారు. ఈ సినిమా ఇప్పటికే దాదాపు రూ.265 కోట్లు వసూళ్లను రాబట్టి, రూ.300కోట్ల క్లబ్‌లో చేరడానికి రెడీ అవుతోంది.

మరిన్ని వార్తలు