ఘట్టమనేని వారి 'మనం'

10 Sep, 2015 09:30 IST|Sakshi
ఘట్టమనేని వారి 'మనం'

అక్కినేని ఫ్యామిలీ సినిమాగా వచ్చిన 'మనం'  చాలా మంది నటులను ఆలోచనలో పడేసింది.  ఈ సినిమాతో  తరతరాలుగా సినీరంగంలో ఉన్న చాలా కుటుంబాలు అలాంటి సినిమాలు చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించాయి. ముఖ్యంగా మెగా ఫ్యామిలీతో పాటు సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి కూడా ఈ ప్రయత్రాలు భారీగానే ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే దర్శకులు కూడా ఆ తరహా కథలను రెడీ చేస్తున్నారు.

తాజా సమాచారం ప్రకారం ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మూడు తరాల నటులు కలిసి ఓ సినిమా చేసే ఆలోచనలో ఉన్నారట. తెలుగు ఇండస్ట్రీకి చెందిన ఓ స్టార్ డైరెక్టర్.. కృష్ణ, మహేష్, గౌతమ్లతో ఓ సినిమా తెరకెక్కించాడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే కథ కూడా వినిపించిన ఆ డైరెక్టర్ స్క్రిప్ట్ ను మరింత పకడ్బందీగా రెడీ చేసే పనిలో ఉన్నాడట.

మహేష్ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉన్నప్పుడు ఆ తరువాత హీరో అయ్యాక కూడా పలు సినిమాల్లో కృష్ణ, మహేష్లు కలిసి నటించారు. అయితే ఘట్టమనేని మూడోతరం వారసుడిగా '1 నేనొక్కడినే' సినిమాతో గౌతమ్ పరిచయం కావడంతో.. ఈ మూడు తరాల నటులు కలిసి నటిస్తారా అని అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతానికి చర్చల దశలోనే ఉన్న ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు ఎప్పుడు వస్తుందో చూడాలి.