సూపర్స్టార్ భార్యకు సుప్రీం నోటీసులు

8 Jul, 2016 18:20 IST|Sakshi
సూపర్స్టార్ భార్యకు సుప్రీం నోటీసులు

మరొక్క రెండు వారాల్లో కబాలి సినిమా విడుదల అవుతుందనగా.. సూపర్స్టార్ రజనీకాంత్ భార్య లతకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కొచ్చాడయాన్ సినిమా హక్కుల వివాదంలో ఈ నోటీసులు జారీ అయినట్లు తెలుస్తోంది. రజనీకాంత్ కూతురు సౌందర్య దర్శకత్వం వహించిన ఈ సినిమా హక్కులను లత అక్రమంగా అమ్మారని యాడ్ బ్యూరో అడ్వర్టైజింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ సుప్రీంలో కేసు దాఖలు చేసింది. లతా రజనీకాంత్ కొన్ని పత్రాలను ఫోర్జరీ చేశారని గత సంవత్సరం ఓ ఎఫ్ఐఆర్ దాఖలైంది.

2015 జూన్ 9వ తేదీన యాడ్ బ్యూరో సంస్థ ఫిర్యాదు మేరకు ఈ ఎఫ్ఐఆర్ దాఖలైంది. కోర్టులో నకిలీ పత్రాలు సమర్పించి సినిమా హక్కులను లత ఓ ఎంటర్టైన్మెంట్ కంపెనీకి అమ్మారని అందులో పేర్కొన్నారు. మోషన్ కాప్చర్ విధానంలో తీసిన మొట్టమొదటి సినిమా అయిన కొచ్చాడయాన్లో రజనీకాంత్ త్రిపాత్రాభినయం చేయగా, ఆయన సరసన దీపికా పడుకొనే నటించింది. మరోవైపు.. రజనీకాంత్ నటించిన కబాలి సినిమా ఈనెల 22వ తేదీన విడుదల కావాల్సి ఉంది. యూట్యూబ్లో ఈ సినిమా టీజర్, పాట ఇప్పటికే సంచలనం సృష్టించాయి. వయసు మళ్లిన డాన్గా రజనీ లుక్ అదిరిపోయిందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.