పాల వ్యాపారంలోకి ప్రముఖ నిర్మాత

22 Jun, 2018 13:20 IST|Sakshi
సురేష్‌ బాబు వ్యవసాయం క్షేతంలో ఆవులు

ఇన్నాళ్లు సినిమా, థియేట‌ర్ల‌ వ్యాపారంతో బిజీబిజీగా ఉన్న నిర్మాత దగ్గుబాటి సురేష్‌బాబు సరికొత్త వ్యాపారాన్ని ప్రారంభించారు. 'హ్యాపీ ఆవులు' పేరుతో స్వచ్ఛమైన పాల ఉత్పత్తికి ఆయన శ్రీకారం చుట్టారు. హైదరాబాద్ నగర శివార్లలో తనకున్న 30 ఎకరాల వ్యవసాయ భూమిలో 30 ఆవులను పెంచుతున్నారు. మార్కెట్లో లభిస్తున్న పాలు, కూరగాయల్లో రసాయనాల ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇటీవల ఆయన అనారోగ్యానికి గురయ్యారు. దీంతో స్వచ్ఛమైన పాలు, సేంద్రీయ సేద్యంతో కూరగాయలు అందించాలని నిర్ణయానికి వచ్చారు. 

తన వ్యవసాయ క్షేత్రంలో ఆవులకు సేంద్రీయ ఆహారం, స్వచ్ఛమైన నీటిని అందిస్తున్నట్టు సురేష్‌ బాబు తెలిపారు. దీంతో అవి స్వచ్ఛమైన పాలను ఇస్తున్నాయన్నారు. డబ్బు సంపాదించాలనే ధ్యేయంతో కాకుండా స్వచ్ఛమైన పాలకు, బయట దొరుకుతున్న పాలకు ఉన్న తేడా ఏమిటో ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నట్టు ఆయన పేర్కొన్నారు. తన ఫాంలోని ఆవు ఇచ్చిన పాలను లీటరు 150 రూపాయలకు విక్రయించాలని నిర్ణయించామన్నారు. అదేవిధంగా రామానాయుడు స్టూడియోని పూర్తిగా పర్యావరణ అనుకూలమైనదిగా చేయాలనుకుంటున్నానని తెలిపారు. ఇప్పటికే ప్లాస్టిక్బాటిళ్ల స్థానంలో స్టీలు సీసాలను వాడుతున్నామని సురేష్‌బాబు తెలిపారు.

మరిన్ని వార్తలు