భారతీయ సిల్వర్‌ స్క్రీన్ చూడని చిత్రం ఘాజీ

14 Feb, 2017 02:28 IST|Sakshi
భారతీయ సిల్వర్‌ స్క్రీన్ చూడని చిత్రం ఘాజీ

ఇండియన్ సిల్వర్‌ స్క్రీన్ పై ఇప్పటి వరకూ ఎవరూ చూడని చిత్రంగా ఘాజీ ఉంటుందని ఆ చిత్ర కథానాయకుడు రానా పేర్కొన్నారు. బాహుబలి చిత్రంలో భళ్లాలదేవాగా జీవించి భళా అనిపించుకున్న బహుభాషా నటుడు రానా. టాలీవుడ్‌ నటుడే అయినా తమిళం, హిందీ భాషల్లోనూ బహుళ ప్రాచుర్యం పొంది మోస్ట్‌ వాంటెడ్‌ నటుడిగా ఎదుగుతున్న రానా తాజాగా కథానాయకుడిగా నటించిన మరో త్రిభాషా చిత్రం ఘాజీ. నటి తాప్సీ కథానాయకిగా నటించిన ఈ చిత్రాన్ని పీవీపీ.సినిమా, మ్యాట్నీ ఎంటర్‌టెయిన్ మెంట్‌ చిత్ర నిర్మాణ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. నవ దర్శకుడు సంకల్ప్‌ వెండితెరపై ఆవిష్కరించిన భారీ ఎండ్వెంచర్‌ థ్రిల్లర్‌ కథా చిత్రం ఘాజీ. కే సంగీతాన్ని అందించిన ఈ చిత్రం తమిళం, తెలుగు, హిందీ  భాషల్లో ఈ నెల 17న విడుదల కానుంది. ఈ చిత్ర ప్రమోషన్ లో భాగంగా చెన్నైకి వచ్చిన రానాతో సాక్షి భేటీ.


ప్ర: ఘాజీ చిత్ర నేపథ్యం ఏమిటి?
జ: ఇది 1971లో విశాఖపట్టణంలో జరిగిన ఇండియా–పాకిస్తాన్ ల మధ్య సముద్ర భాగంలో జరిగిన యాదార్థ యుద్ధం ఇతివృత్తంగా తెరకెక్కించిన చిత్రం.

ప్ర: ఇంతకు ముందు ఇలాంటి నేపథ్యంలో వచ్చిన చిత్రాలకు ఘాజీ చిత్రానికీ డిఫరెంట్‌ ఏమిటి?
జ: ఇంతకు ముందు ఇండియా–పాకిస్తాన్ ల మధ్య పోరు కథలతో  భారతీయ చిత్రాలు చాలా తక్కువే వచ్చాయి. అయితే ఘాజీ చిత్రం నేవి నేపథ్యంలో రూపొందిన చిత్రం. ఈ తరహా చిత్రాలను ఇప్పటి వరకూ భారతీయ వెండితెరపై చూసి ఉండరు.

ప్ర: ఘాజీ చిత్రంలో మీరు నటించడానికి ప్రధాన కారణం?
జ: ముందుగా కొత్త కాన్సెప్‌్టతో కూడిన కథా చిత్రాల్లో నటించడానికి నేను చాలా ఆసక్తి చూ పుతాను. ఆ విధంగా నేను సినిమా లవర్‌ని. ఘాజీ చి త్రం మనదేశంలో మన విశాఖపట్టణంలో 1971లో నాకు తెలియని చిన్నతనంలో విన్న యుద్ధం గురించిన కథ. ఘాజీ అనే సబ్‌మెరైన్ లో 71 రోజుల పాటు జరిగిన ఇండియా–పాకిస్తాన్ ల మధ్య యుద్ధం ఇతివృత్తం కావడంతో సహజంగానే ఈ చిత్రంలో నటించాలనే కోరిక కలిగింది. ఇంకా చెప్పాలంటే బ్లూఫిష్‌ అనే కథ చదివి దీని రచయిత, దర్శకుడు అయిన సంకల్ప్‌ను వెతుక్కుంటూ వెళ్లి ఈ చిత్ర అవకాశాన్ని అందుకున్నాను. మనం ఇక్కడ సుఖ సంతోషాలతో జీవిస్తున్నామంటే అందుకు కారణం సరిహద్దులో పోరాడుతున్న సైనికుల పోరు, త్యాగాలే. వారిని గౌరవించేలా ఈ ఘాజీ చిత్రం ఉంటుంది.

ప్ర: ఘాజీ చిత్రంలో హైలెట్స్‌ గురించి?
జ: చిత్ర కథే ఒక హైలెట్‌. చిత్రం 60 శాతం అండర్‌వాటర్‌లోనే జరుగుతుంది. అండర్‌వాటర్‌లో నటించడం చాలా రిస్క్‌తో కూడింది. సూర్యరశ్మి సోకదు. సాధారణ దుస్తులు ధరించలేం. అందుకు ప్రత్యేక దుస్తులు ధరించి నటించాం. చిత్రం చాలా సీరియస్‌గా సాగుతుంది. ఇందులో నేను లెఫ్టినెంట్‌ ఆర్మీ అధికారిగా నటించాను. అతి ఫోర్స్‌ గానీ, అనవసర సంభాషణలు గానీ ఉండవు. కథ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఘాజీ చిత్రంలో నటించడం గర్వంగా భావిస్తున్నా.

ప్ర: నటి తాప్సీ గురించి?
జ: నటి తాప్సీది ఇందులో కీలక పాత్ర. తను ఇందులో బెంగాలీ అమ్మాయిగా నటించారు. ఆమె నటనకు చాలా పేరు వస్తుంది.

ప్ర: మీరు ఎక్కువ పిరియడ్‌ కథా చిత్రాల్లోనే నటించండానికి కారణం?
ప్ర: కారణం అంటూ ప్రత్యేకంగా ఏమీ లేదు. ఏ చిత్రానికైనా కంటెంట్‌  ముఖ్యం. కథ నన్ను ఆకట్టుకుంటే ఏ తరహా చిత్రం అయినా చేయడానికి నేను రెడీ. సక్సెస్‌ అవుతుందనే చిత్రాలు చేయలేం. ఉదాహరణకు బాహుబలి చిత్రాన్ని విజయం సాధించాలన్న ఒక్క కారణంతోనే చేయలేదు. ఒక గొప్ప చిత్రం, వినూత్న ప్రయోగంతో చేయాలన్న లక్ష్యంతో ఆ చిత్రం చేశాం. అది భారతీయ సినిమా గర్వించే చిత్రంగా నిలిచింది.

ప్ర: బాహుబలి–2 చిత్రం గురించి?
జ: బాహుబలికి సంబంధించిన రెండు కథలు ముందుగానే సిద్ధం అయ్యాయి. బాహుబలి చిత్రం అద్భుత విజయాన్ని సాధించడంతో దానికి సీక్వెల్‌ ఇంకా ప్రముఖ సాంకేతిక నిపుణులతో మరింత  బ్రహ్మాండంగా తెరెక్కుతోంది. షూటింగ్‌ పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఆ చిత్రం ఏప్రిల్‌ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు ముస్తాబవుతోంది.

ప్ర: మీ తాతగారు డి.రామానాయుడు ఎన్నో గొప్ప చిత్రాలను నిర్మించారు. వాటిలో ఏదైనా రీమేక్‌లో నటించాలన్న కోరిక ఉందా?
జ: కోరిక ఉన్నా వాటిని రీమేక్‌ చేయడం, అందులో నటించడం అంటే నాకు చాలా భయం. ఎందుకంటే అవన్నీ గోల్డెన్  హిట్‌ చిత్రాలు. సరిగా చేయలేమేమోనన్న భయం. అందుకే అలాంటి సాహసం చేయలేను.

ప్ర: తదుపరి చిత్రాలు?
జ: ప్రస్తుతం తెలుగులో తేజ దర్శకత్వంలో ఒక చిత్రం చేస్తున్నాను. త్వరలో దర్శకుడు సత్యశివ దర్శకత్వంలో తమిళం, తెలుగు భాషల్లో తెరకెక్కనున్న చిత్రంలో నటించనున్నాను. ఇది 1945 నేపథ్యంలో సాగే పిరియడ్‌ కథా చిత్రమే.