మనసు దోసేశాడు!

5 Feb, 2017 23:11 IST|Sakshi
మనసు దోసేశాడు!

షూటింగ్‌ స్పాట్‌లో దర్శకుడు చెప్పినట్టు నటించే సూర్య.. షూటింగులకు సెలవు రోజైన ఆదివారం ఇంట్లో భార్య జ్యోతిక చెప్పినట్టు చేశారు. సినిమాలో నటిస్తారు కానీ, ఇంట్లో నటించలేదు. తన ప్రేమను వ్యక్తం చేశారు. శ్రీమతి దర్శకత్వ పర్యవేక్షణలో గరిటె తిప్పారు సూర్య. కిచెన్‌లోకి వెళ్లి శ్రీమతికి ఓ దోసేసి.. ప్రేమగా ఆమె మనసు దోచేశారు. ఇంతకీ, సడన్‌గా సూర్య ఎందుకు దోసెలు వేశారు అనే సందేహం వచ్చిందా? అసలు విషయం ఏంటంటే... ఇటీవల జ్యోతిక ముఖ్య పాత్రలో నటించిన లేడీ ఓరియెంటెడ్‌ సినిమా ‘మగళిర్‌ మట్టుమ్‌’ ట్రైలర్‌ విడుదలైంది. అందులో ఇంట్లో అందరి కోసం లెక్కకు మించిన దోసెలు వేసే అమ్మ లేదా శ్రీమతి కోసం ఎవరైనా ఒక్క దోసె వేశారా? అనే పాయింట్‌ లేవదీశారు. అంతే... ‘ప్రేమతో మీ ఇంట్లో మహిళలకు ఓ దోసె వేయండి’ అంటూ దోసె ఛాలెంజ్‌ స్టార్ట్‌ చేశారు.

ఐస్‌ బకెట్‌ తరహాలో అన్నమాట. ఒకరు దోసెలు వేసిన తర్వాత స్నేహితులకు ఛాలెంజ్‌ విసురుతారు. ఇప్పుడిది సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. తాను దోసె వేసిన తర్వాత హీరో మాధవన్, దర్శకుడు వెంకట్‌ ప్రభు, సంగీత దర్శకులు హ్యారీస్‌ జయరాజ్, దేవిశ్రీ ప్రసాద్‌లకు సూర్య సవాల్‌ విసిరారు. ‘సింగం సార్‌... దోసె రౌండ్‌గా లేకున్నా ఓకేనా? లేదంటే మా అమ్మ దగ్గర నేర్చుకుంటా’ అని దేవిశ్రీ రిప్లై ఇచ్చారు.