సుశాంత్ ఆఖ‌రు సినిమా కూడా ఓటీటీలోనే..

25 Jun, 2020 18:31 IST|Sakshi

బాలీవుడ్ యంగ్‌ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మ‌ర‌ణంపై యావత్‌ దేశం దిగ్భ్రాంతి వ్య‌క్తం చేసింది. నేటికీ ఆయ‌న‌ అభిమానులు సుశాంత్‌ను త‌లుచుకుంటూ కుమిలిపోతున్నారు. ఇక సుశాంత్ చివ‌రిసారిగా న‌టించిన "దిల్ బేచారా" చిత్రం విడుద‌ల‌ క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డింది. ఇది "ద ఫాల్ట్ ఇన్ అవ‌ర్ స్టార్స్"‌కు రీమేక్‌. తాజాగా ఈ సినిమా డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో జూలై 24న రిలీజ్‌ కానుంది. ఈ సంద‌ర్భంగా "ప్రేమ, ఆశ‌, అంతులేని జ్ఞాప‌కాల స‌మూహార‌మే ఈ క‌థ‌. సుశాంత్ న‌టించిన ఈ సినిమా అంద‌రి మ‌న‌సులో చిర‌స్థాయిగా నిలుస్తుంది" అంటూ డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్ ట్వీట్ చేసింది. క్యాస్టింగ్ డైరెక్ట‌ర్ ముఖేశ్ చాబ్రా తొలిసారి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాలో సుశాంత్ స‌ర‌స‌న సంజ‌నా సాంఘి న‌టించింది. ఈ సినిమా అంద‌రూ ఉచితంగా చూడొచ్చ‌ని సంజ‌నా పేర్కొంది. (సుశాంత్ కుక్క మ‌ర‌ణం: నిజ‌మేనా?)

ద‌ర్శ‌కుడు ముఖేశ్ మాట్లాడుతూ.. "సుశాంత్ నా సినిమాలో హీరోనే కాదు, నా స్నేహితుడు కూడా. 'కాయ్ కో పీచే' నుంచి 'దిల్ బేచారా' వ‌ర‌కు అత‌నేంటో నాకు తెలుసు. నేను ద‌ర్శ‌క‌త్వం వ‌హించే తొలి సినిమాలో అత‌ను న‌టిస్తాడ‌ని నాకు మాటిచ్చాడు. మేమిద్ద‌రం ఎన్నో క‌ల‌లు క‌న్నాం, మ‌రెన్నో ప్లాన్‌లు వేసుకున్నాం. కానీ అవ‌న్నీ అలాగే మిగిలిపోయాయి. ఇప్పుడు ఒంట‌రిగా ఈ సినిమా రిలీజ్ చేస్తున్నా" అని భావోద్వేగానికి లోన‌య్యాడు. సుశాంత్‌ గ‌త చిత్రం 'డ్రైవ్‌'ను నిర్మాత క‌ర‌ణ్ జోహార్‌ ఓటీటీలోనే రిలీజ్ చేసిన విష‌యం తెలిసిందే. దీంతో ఆఖ‌రు చిత్రాన్నైనా థియేట‌ర్‌లో విడుద‌ల చేయాల‌ని అభిమానులు కోరిన‌ప్ప‌టికీ నిర్మాత‌లు ఓటీటీకే మొగ్గు చూపారు. (అమ్మా.. మన ఇద్దరం తప్పనుకుంటా: సుశాంత్‌)

మరిన్ని వార్తలు