‘దిశ చనిపోయిన తర్వాత సుశాంత్‌ చికిత్స ఆపేశాడు’

21 Jul, 2020 15:22 IST|Sakshi

ముంబై: నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతిపై దర్యాప్తు చేస్తున్న ముంబై పోలీసులు నలుగురు మానసిక వైద్యుల వాంగ్మూలాలను నమోదు చేశారు. సుశాంత్‌కి థెరపీ సెషన్స్ ఇచ్చిన సైకోథెరపిస్ట్‌ను సోమవారం ఉదయం బాంద్రా పోలీస్ స్టేషన్‌కు పిలిపించి ఐదు గంటలపాటు ప్రశ్నించారు. ఆయన వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డ్ చేశారు. సైకోథెరపిస్ట్‌లను కాకుండా, పోలీసులు గత వారం ముంబైకి చెందిన మరో ముగ్గురు మానసిక వైద్యుల వాంగ్మూలాలను కూడా నమోదు చేశారు. సుశాంత్ డిప్రెషన్‌కు చికిత్స తీసుకుంటున్నాడని, కానీ ఆత్మహత్య  చేసుకోవడానికి కొన్ని రోజులు ముందు దానిని ఆపేశాడని అతని స్నేహితులు తెలిపారు. 

పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. దిషా సాలియన్ మరణించినప్పటి నుంచి సుశాంత్‌ చికిత్స తీసుకోవడం మానేశాడు. దిషా మరణించిన తరువాత పోలీసులు సుశాంత్‌ను విచారించారు. దీంతో సుశాంత్‌ చాలా ఒత్తిడికి గురైనట్లు తెలుస్తోంది. దిశా సాలియన్ సుశాంత్‌ టాలెంట్ మేనేజ్‌మెంట్ సంస్థలో ఉద్యోగిని. ఈ సంస్థను ఉదయ్ సింగ్ గౌరీ నిర్వహించేవారు. ఇదిలా ఉండగా సుశాంత్ రెండుసార్లు మాత్రమే దిశను కలిశారని గౌరీ పోలీసులకు తెలిపారు. 

చదవండి: ‘అమిత్‌షా మీరు తలుచుకుంటే నిమిషం చాలు’

జూన్ 9న 14వ అంతస్తులోని ఫ్లాట్ నుండి దూకి దిశా సాలియన్ ఆత్మహత్య చేసుకుంది. ఆమె సుశాంత్ మాజీ మేనేజర్ అని వివిధ వార్తా కథనాల ద్వారా తెలిసింది. దీంతో పోలీసులు సుశాంత్‌ను పలు విధాలుగా ప్రశ్నించడంతో ఒత్తిడికి గురై డిప్రెషన్‌ మందులు వాడటం కూడా ఆపేశాడు. గౌరీ స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసిన పోలీసులు, ఎవరైనా ప్లాన్‌ చేసి సుశాంత్‌ను బెదిరించడం వల్ల మరణించాడా అనే కోణంలో కూడా దర్యాప్తు చేశారు. నెగిటివ్‌ స్టోరీ యాంగిల్‌లో కూడా విచారణ చేస్తున్నారు. చాలా మంది అగ్రశ్రేణి బాలీవుడ్ టాలెంట్ మేనేజర్లు, కాస్టింగ్ మేనేజర్లను కూడా పోలీసులు ప్రశ్నించారు. ఈ కేసుకు సంబంధించి మంగళవారం పోలీసులు మరికొందరు బాలీవుడ్ ప్రముఖుల వాంగ్మూలాలను కూడా నమోదు చేశారు. 

మరిన్ని వార్తలు