సుశాంత్ సినిమా షురూ

21 Mar, 2015 22:29 IST|Sakshi
సుశాంత్ సినిమా షురూ

‘కాళిదాసు’, ‘కరెంట్’, ‘అడ్డా’ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న సుశాంత్ హీరోగా మరో సినిమా ప్రారంభమైంది. జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో శ్రీజీ ఫిలిమ్స్ పతాకంపై చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో ఉగాది రోజున ప్రారంభమైంది. నాగార్జున పూజా కార్యక్రమాలు నిర్వహించి స్క్రిప్ట్‌ను దర్శకునికి అందించారు.
 
  హీరో సుశాంత్ ‘అందరికీ ఉగాది శుభాకాంక్షలు ’ అని డైలాగ్ చెప్పే సన్నివేశానికి అఖిల్ అక్కినేని కెమెరా స్విచాన్ చేయగా, నాగచైతన్య క్లాప్‌నిచ్చారు. సుమంత్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ -‘‘శ్రీధర్ సీపాన మంచి కథ ఇచ్చారు. ఈ చిత్రంతో సుశాంత్‌కు భారీ హిట్ రావడం ఖాయం. ఏప్రిల్ 10 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది’’ అని తెలిపారు. ఈ చిత్రానికి కథ, మాటలు: శ్రీధర్ సీపాన, ఫైట్స్: కనల్ కణ్ణన్, ప్రొడక్షన్ కంట్రోలర్: ఎం.వి.ఎస్. వాసు