సుశాంత్‌ ఆత్మహత్య: మాజీ ప్రేయసి స్పందన

14 Jun, 2020 17:49 IST|Sakshi

ముంబై : బాలీవుడ్ యువహీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌(34) ఆదివారం ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. సుశాంత్‌ మరణవార్త విని ఆయన మాజీ ప్రేయసి, నటి అంకితా లోఖండే షాక్‌కు గురయ్యారు. ఓ మీడియా సంస్థ అంకితకు ఫోన్‌ చేసే చెప్పేంతవరకు సుశాంత్‌ మరణ వార్త ఆమెకు తెలియదట. మీడియా ప్రతినిధి ఫోన్‌ చేసి విషయం చెప్పగానే.. ఏంటి అని షాకయ్యారు. ఆ తర్వాత ఫోన్‌ పెట్టేసినట్లు తెలుస్తోంది. (చదవండి : బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ ఆత్మహత్య)

కాగా, నటి అంకితా లోఖండే, సుశాంత్‌ ఆరేళ్లుగా ప్రేమించుకున్నారు. 2016లో కొన్ని కారణాల వల్ల వీరు విడిపోయారు. వీరిద్దరు గతంలో జీ టీవీలో ప్రసారమైన ‘ పవిత్ర రిశ్తా’ సీరియల్ లో కలిసి నటించారు. ఆ సమయంలోనే వారు ప్రేమలో పడ్డారు. దాదాపు ఆరేళ్ల పాటు వీరి బంధం కొనసాగింది. 2016లో వీడిపోయేముందు ‘ఒంటరినని బాధపడకు, నేను నీ గుండెల్లో ఎప్పడు చిరస్థాయిగా నిలిచిపోతాను’ అని అంకిత ట్వీట్ కూడా‌ చేసింది. (చదవండి : సుశాంత్‌ చివరి భావోద్వేగ పోస్ట్‌ ఇదే)

ఆ తర్వాత సుశాంత్‌ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి బిజీ అయ్యాడు. మణికర్ణిక సినిమాలో అంకిత ముఖ్య పాత్ర పోషించించగా.. ఆ సందర్భంగా సుశాంత్‌ ఆల్‌ ది బెస్ట్‌ చెప్తూ ట్వీట్‌ చేశాడు. అంకిత, సుశాంత్‌లు వీడిపోయాక కూడా మంచి స్నేహితులుగా కొనసాగారు.  కాగా, అంకితా లోఖండేకు ఇటీవల ఎంగైజ్‌మెంట్‌ అయినట్లు సమాచారం. విక్కీ జైన్‌ అనే వ్యక్తితో అంకిత నిశ్చితార్థం జరిగినట్లు వార్తాలు వచ్చాయి. అయితే ఈ విషయాన్ని అంకిత అధికారికంగా ప్రకటించలేదు. 

కాగా, సుశాంత్‌ ఆదివారం ముంబైలోని తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. సుశాంత్‌ ఆత్మహత్య వార్తతో బాలీవుడ్‌ ఒక్కసారిగా షాక్‌కు గురైంది. ఈ వార్త తమకు షాక్‌కు గురి చేసిందని, సుశాంత్‌ ఆత్మకు శాంతి చేకూరాలని  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు బాలీవుడ్‌, టాలీవుడ్‌ చెందిన పలువురు ట్వీట్‌ చేశారు. అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. (చదవండి : సుశాంత్‌ మరణం: షాక్‌లో సినీ ఇండస్ట్రీ)

‘కోయ్‌ పో చి’తో కెరీర్‌ను ఆరంభించిన సుశాంత్‌ ఆ తర్వాత ‘శుద్ధ్‌ దేశీ రొమాన్స్‌’, ‘పీకే’, ‘డిటెక్టీవ్‌ బొమ్‌కేష్‌ బక్షి’, ‘ఎం.ఎస్‌.ధోనిః ద అన్‌టోల్డ్‌ స్టోరీ’, ‘రాబ్టా’, ‘వెల్‌కమ్‌ న్యూయార్క్‌’, ‘కేదార్‌నాథ్‌’, ‘సోంచారియా’, ‘చిచ్చోర్‌’, ‘డ్రైవ్‌’ తదితర చిత్రాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ సొంతం చేసుకున్నారు.

మరిన్ని వార్తలు