రవితేజ ఒప్పేసుకున్నాడు

28 Nov, 2015 10:21 IST|Sakshi
రవితేజ ఒప్పేసుకున్నాడు

షార్ట్ ఫిలిం మేకర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సుధీర్ వర్మ తరువాత డైరెక్టర్గా కూడా మారి మంచి విజయాన్నే సాధించాడు. నిఖిల్, స్వాతి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన 'స్వామి రారా..' సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన వర్మ, తొలి సినిమాతోనే స్టార్ హీరోల దృష్టిని కూడా ఆకర్షించాడు. ఎంత సక్సెస్ ఫుల్గా లాంచ్ అయినా, ద్వితీయ విఘ్నాన్ని మాత్రం దాటలేకపోయాడు.

తొలి సినిమా ఘనవిజయం సాధించటంతో యంగ్ హీరో నాగచైతన్య పిలిచి మరీ సుధీర్తో సినిమా చేశాడు. మరోసారి క్రైమ్ థ్రిల్లర్నే నమ్ముకున్న సుధీర్ వర్మ నాగచైతన్య హీరోగా 'దోచెయ్' సినిమాను రూపొందించాడు. అయితే ఈ సినిమా ఆశించిన స్ధాయిలో ఆకట్టుకోలేదు. దీంతో అప్పటి వరకు బిజీ డైరెక్టర్ అయిపోతాడనుకున్న సుధీర్ ఒక్కసారిగా డీలా పడిపోయాడు. అప్పటినుంచి మరోసారి తనను తాను ప్రూవ్ చేసుకోవటం కోసం ఒక్క ఛాన్స్ అంటూ ఎదురుచూస్తున్నాడు.

ప్రస్తుతం 'బెంగాల్  టైగర్' రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న రవితేజ, సుధీర్ వర్మతో సినిమాకు అంగీకరించాడన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే కథ కూడా విన్న మాస్ మహరాజ్ చిన్న చిన్న మార్పులు సూచించాడట. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న రవితేజ సుధీర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న యాక్షన్ డ్రామాను కూడా వీలైనంత త్వరగా సెట్స్ మీదకు తీసుకురావాలని భావిస్తున్నాడు.