ఏంటి ఇదేమన్నా జోక్‌ అనుకుంటున్నారా : నటి

4 Oct, 2018 19:18 IST|Sakshi

‘ఏంటి ఇదేమన్నా జోకా? అంటే మనం ఈ దౌర్జన్యాలను, పోకిరి వేషాలు వేసే వాళ్లను అలా వదిలేయాలంటారా? అయినా విధ్వంసం సృష్టిం‍చే అటువంటి గూండాలతో ఫొటో దిగడానికి ఎవరు ఇష్టపడతారు. అసలేం జరిగింది? మనందరికీ ఏమయ్యింది?’ అంటూ నటి స్వరా భాస్కర్‌ మహారాష్ట్ర నవనిర్మాణ సమితి (ఎంఎన్‌ఎస్‌) నాయకులను ఉద్దేశించి ట్విటర్‌ వేదికగా ఘాటు విమర్శలు చేశారు. ఈ విధంగా ట్వీట్‌ చేసి మరోసారి తనుశ్రీ దత్తాకు తన మద్దతు తెలిపారు.

కాగా తనుశ్రీ- నానా పటేకర్‌ వివాదం ప్రస్తుతం బాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. పదేళ్ల క్రితం ‘హార్న్‌ ఓకే ప్లీజ్‌’ చిత్ర సమయంలో నానా తనతో అసభ్యంగా ప్రవర్తించారంటూ తనూశ్రీ ఆరోపించారు. అలాగే ఆ సమయంలో నానాకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్‌ఎస్‌) కార్యకర్తలు తనను బెదిరించారని తనుశ్రీ పత్రికాముఖంగా ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తనుశ్రీ పబ్లిసిటీ కోసమే ఇలాంటి చౌకబారు ఆరోపణలు చేస్తోందని ఎంఎన్‌ఎస్‌ కార్యకర్తలు తనూశ్రీపై విమర్శనాస్త్రాలు సంధించడం మొదలుపెట్టారు.

ఇదిలా ఉండగా.. తనూశ్రీ తన చెల్లెలితో కలిసి బిగ్‌బాస్‌లో పాల్గొంటుందనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎంఎన్‌ఎస్‌పై తప్పుడు వ్యాఖ్యలు చేసిన తనుశ్రీని బిగ్‌బాస్‌లోకి తీసుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని ఆ పార్టీ నేతలు షో నిర్వహకులకు హెచ్చరికలు జారీచేశారు. ఈ మేరకు ఎంఎన్‌ఎస్‌ యువజన విభాగానికి చెందిన నేతలు బుధవారం లోనవాలాలోని బిగ్‌బాస్‌ సెట్‌కు వెళ్లి వారికి లేఖను అందజేశారు. ఒకవేళ తనుశ్రీని హౌస్‌లోకి తీసుకుంటే హింస చోటుచేసుకుంటుందని ఆ లేఖలో పేర్కొన్నారు. కాగా ఈ విషయాన్ని తీవ్రంగా తప్పు పట్టిన స్వరా భాస్కర్‌ ఎంఎన్‌ఎస్‌ నేతలను ఉద్దేశించి ట్వీట్‌ చేసి తనుశ్రీకి మద్దతుగా నిలిచారు.

>
మరిన్ని వార్తలు