స్వేచ్ఛలాంటి సినిమాలు అవసరం

27 Feb, 2020 02:57 IST|Sakshi
∙తీగల కృష్ణారెడ్డి, చమ్మక్‌ చంద్ర, రాజు నాయక్, మంగ్లీ

– మాజీ మంత్రి తీగల కృష్ణారెడ్డి

‘‘అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీఆర్‌ల కాలంలో సినిమాలు వంద రోజులు ఆడటం మనం చూశాం. ప్రస్తుతం ఆ రోజులు లేవు. ఎన్నో మార్పులు వచ్చాయి. అయినా కొత్త తరహా సినిమాలు వస్తున్నాయి.. కొత్త హీరోలు వస్తున్నారు’’ అని మాజీ మంత్రి తీగల కృష్ణారెడ్డి అన్నారు. గాయని మంగ్లీ లీడ్‌ రోల్‌లో కెపీఎన్‌ చౌహాన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘స్వేచ్ఛ’. రాజు నాయక్‌ నిర్మించిన ఈ సినిమా ఈ శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్‌ వేడుకలో తీగల కృష్ణారెడ్డి మాట్లాడుతూ– ‘‘స్త్రీ జాతికి జరుగుతున్న అన్యాయంపై సందేశాత్మకంగా నిర్మించిన ‘స్వేచ్ఛ’లాంటి చిత్రాల అవసరం నేటి సమాజానికి ఎంతైనా ఉంది’’ అన్నారు.

‘‘ఆడపిల్లలను రక్షించండి.. చెట్లను సంరక్షించండి అనే సందేశంతో ‘స్వేచ్ఛ’ తీశారు. ఇందులో మంచి పాత్ర చేశాను’’ అన్నారు నటుడు చమ్మక్‌ చంద్ర. ‘‘ఇది బంజారాలకు సంబంధించిన సినిమా కాదు.. ప్రజలకు సంబంధించిన చిత్రం’’ అన్నారు మంగ్లీ. ‘‘ఇలాంటి సినిమాలకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ లాంటి వారు సహకారం అందించాలి’’ అన్నారు దర్శకుడు, హీరో కేపీఎన్‌ చౌహాన్‌. ‘‘మా సినిమా మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది’’ అన్నారు రాజు నాయక్‌. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు భోలే , సరస్వతీ డెవలపర్స్‌ రాజు నాయక్, సతీష్‌ నాయుడు, తారకేష్, బాలనటుడు చక్రి తదితరులు పాల్గొన్నారు.
 

>
మరిన్ని వార్తలు