'సైరా' మ్యూజిక్‌ డైరెక్టర్‌ లైవ్‌ కన్సర్ట్‌

13 Nov, 2018 18:48 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రముఖ బాలీవుడ్‌ సంగీత దర్శకుడు అమిత్‌ త్రివేది నవంబర్‌ 24న తొలిసారి హైదరాబాద్‌లో మ్యూజిక్‌ లైవ్‌ ప్రోగ్రామ్‌ను నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమంలో జోనితా గాంధీ, దివ్యా కుమార్‌ తదితరులు పాల్గొనబోతున్నారు. సంగీత ప్రియులకు ఈ కార్యక్రమం వీనుల విందుగా ఉంటుందనడంలో సందేహం లేదని నిర్వాహకులు అభిప్రాయపడుతున్నారు. 'ఇంద్రధనుష్‌ - అమిత్‌ త్రివేది లైవ్‌ కాన్సర్ట్‌' అనే పేరుతో ఈ సంగీత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మనిషి తన జీవితంలో సంతోషం, బాధ, ప్రేమ ఇలాంటి ఎన్నో అనుభవాలను చవిచూస్తాడని, అలాంటి అనుభవాల కలయికనే ఇంద్రధనుస్సు అని సంబోధిస్తుంటారని అందుకే ఈ ప్రోగ్రామ్‌కు ఇంద్రధనుష్‌ అనే పేరుని పెట్టామని తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో అమిత్‌ సౌండ్‌లో కొత్త టెక్నాలజీని అందరికీ పరిచయం చేయబోతున్నారు. థియేటర్స్‌లో మ్యూజిక్‌ కంపోజర్‌గా కెరీర్‌ను స్టార్ట్‌ చేసిన అమిత్‌ త్రివేది పలు జింగిల్స్‌, యాడ్‌ ఫిలింస్‌కు పనిచేశారు.

'ఆమిర్‌' చిత్రంతో 2008లో మ్యూజిక్‌ డైరెక్టర్‌గా అమిత్‌ త్రివేది ఎంట్రీ ఇచ్చారు. 'దేవ్‌ డి' చిత్రం కోసం అనురాగ్‌ కశ్యప్‌తో జత కట్టారు. ఈ చిత్రానికిగాను అమిత్‌ త్రివేదికి నేషనల్‌ అవార్డు కూడా దక్కింది. ఉడాన్‌, వేకప్‌ సిద్‌, మన్‌ మర్జియాన్‌ వంటి చిత్రాలకు ఈయన తన సంగీతాన్ని అందించారు. ఇండియన్‌ సినిమాల్లో కొత్త సంగీతాన్ని పరిచయం చేసిన సంగీత దర్శకుల్లో అమిత్‌ త్రివేది తనదైన మార్కును చూపించారు. కేవలం పాశ్చాత్య సంగీత పోకడలతో అందరినీ ఆకట్టుకోవడమే కాదు.. శాస్త్రీయ సంగీతంపై మంచి అవగాహన ఉంది. తెలుగులో ఎంతో ప్రెస్టీజియస్‌ చిత్రంగా భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న 'సైరా నరసింహారెడ్డి'తో టాలీవుడ్‌కు పరిచయం కానున్నారు. ఇక అమిత్‌ త్రివేది తొలిసారి హైదరాబాద్‌కు రానుండటంతో ఘనస్వాగతం పలికేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు