కంటతడిపెట్టిన సాయిధన్సిక

2 Oct, 2017 03:27 IST|Sakshi

తమిళసినిమా: నటి సాయిధన్సికకు సభా నాగరికత తెలియదంటూ సీనియర్‌ నటుడు, దర్శకుడు టి.రాజేందర్‌ ఆమెను కంటతడిపెట్టించిన సంఘటన కోలీవుడ్‌లో కలకలానికి దారి తీసింది. మీరా కదిరన్‌ దర్శకత్వం వహించిన చిత్రం విళిత్తిరు. కృష్ట, విధార్థ్, ఏపీబీ.చరణ్, వెంకట్‌ప్రభు ప్రధాన పాత్రలను పోషించిన ఈ చిత్రంలో నటి సాయి ధన్సిక కథానాయకిగా నటించారు. ఈ చిత్రం కోసం టి.రాజేందర్‌ ఒక పాట రాసి, పాడి, అందులో నటించారు. ఈ చిత్ర విలేకరుల సమావేశం ఇటీవల చెన్నైలో జరిగింది. ఈ కార్యక్రమంలో నటి సాయి ధన్సిక చిత్రం గురించి మాట్లాడి, వేదికపై ఉన్న వారి గురించి ప్రస్తావించలేదు. ఆనంతరం మాట్లాడిన టి.రాజేందర్‌ సాయిధన్సిక చర్యలను తప్పుపడుతూ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

సాయిధన్సికకు సభా నాగరికత తెలియదని విమర్శంచారు. సాయిధన్సికను కబాలి చిత్ర హీరోయిన్‌ అంటున్నారని, కానీ అంతకంటే ముందే తను విళిత్తిరు చిత్రంలో నటించారని గుర్తు చేశారు. అయినా రజనీకాంత్‌తో నటిస్తే టి.రాజేందర్‌ పేరు తెలియదా? అంటూ విమర్శలు గుప్పిస్తుండగా మధ్యలోనే సాయిధన్సిక లేచి టీఆర్‌కు క్షమాపణ చెప్పారు. అయినా అదేమీ పట్టించుకోకుండా టి.రాజేందర్‌ సాయిధన్సికను విమర్శించడంతో ఆమె కన్నీళ్ల పర్యంతం అయ్యారు. ఈ సంఘటనపై స్పందించిన నిర్మాతల మండలి అధ్యక్షుడు, దక్షిణ భారత నటీనటుల సం ఘం కార్యదర్శి విశాల్‌ టి.రాజేందర్‌ చర్యల్ని తీవ్రంగా ఖండిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. మొత్తం మీద ఈ సంఘటన కోలీవుడ్‌లో పెద్ద కలకలానికే దారి తీసింది.

మరిన్ని వార్తలు