సినిమా: నయనతార కంటే ఆ నటే బెస్ట్ అంటున్నారో దర్శకుడు. ఏమా కథ? ఆయనెందుకలా అన్నారు? చూసేస్తే పోలా! దక్షిణాదిలోనే అగ్ర నాయకిగా వెలిగిపోతున్న నటి నయనతార. అయితే ఇటీవల ఈ బ్యూటీ నటించిన చిత్రాలు వరుసగా నిరాశపరచడం నయనతారను కలవరపెట్టే విషయమే. అందులోనూ తను నటించిన హీరోయిన్ సెంట్రిక్ కథా చిత్రాలు ఫ్లాప్ అవడం తన ఇమేజ్కు డ్యామేజ్ కలిగే విషయమే. అయితే ప్రస్తుతం సౌత్ ఇండియన్ సూపర్స్టార్ రజనీకాంత్తో దర్బార్, కోలీవుడ్ దళపతి విజయ్తో బిగిల్, అదే విధంగా టాలీవుడ్ మోగాస్టార్ చిరంజీవికి జంటగా సైరా నరసింహారెడ్డి వంటి భారీ చిత్రాల్లో నటిస్తోంది. ఈ చిత్రాలే నయనతారకిప్పుడు పెద్ద ఆశాకిరణాలు. ఇలాంటి పరిస్థితుల్లో నయనతార కంటే ఆ నటే బెస్ట్ అని ఒక దర్శకుడు పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. ఆ దర్శకుడే నందా పెరియస్వామి. ఈయన ఇంతకు ముందు ఒరు కల్లూరి కథై, మాత్తియోసి, అళగన్ అళగి, వణ్ణ జిగినా వంటి చిత్రాలను తెరకెక్కించారు.
అంతే కాదు నటుడిగా మారి మాయాండి కుటుంబత్తార్, యోగి, మిళగా, గోరియపాళైయం వంటి చిత్రాల్లోనూ ముఖ్యపాత్రల్లో నటించారు. కాగా దర్శకుడు నందా పెరియస్వామి ఒక కథను తయారు చేసుకుని దాన్ని 12 నిమిషాల నిడివితో చిన్న డెమో ఫిలింను రూపొందించారు. దీన్ని ఛాయాగ్రాహకుడి ద్వారా నటి నయనతారకు చేరవేశారు. అది చూసిన నయనతార ఫెంటాస్టిక్, మార్వ్లెస్ అని మెచ్చుకోవడంతో పాటు, ఈ కథను తానే నిర్మించి నటిస్తానని చెప్పిందట. అలా చెప్పి ఇప్పటికే ఏడాది గడిచిపోయిందట. అలా ఏడాదికి పైగా ఊరిస్తూ ఎప్పుడు నటించేదీ, నిర్మించేది చెప్పడం లేదట. ఇదే కథతో రాష్మి రాకెట్ పేరుతో చిత్రం రూపొందుతోంది. అందులో నటి నయనతార పోషించాల్సిన పాత్రలో తాప్సీ నటిస్తోంది. ఈ చిత్రం శనివారమే ప్రారంభమైంది. దీనిపై దర్శకుడు నందా పెరియస్వామి తన ఫేస్బుక్లో పేర్కొంటూ నయనతార కంటే నటి తాప్సీనే బెటర్ అని పొందుపరిచారు.