తాప్సీ చిత్రాన్ని నయనతార చిత్ర విలన్ చేజిక్కించుకున్నారు. బాలీవుడ్లో కథానాయకిగా మంచి మార్కెట్ను తెచ్చుకున్న నటి తాప్సీ. దీంతో దక్షిణాదిలో మళ్లీ అవకాశాలు వరిస్తున్నాయి. అలా ఈ సంచలన నటి తమిళం, తెలుగు భాషల్లో నటిస్తున్న తాజా చిత్రం గేమ్ ఓవర్. తాప్సీ సెంట్రిక్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని ఇంతకు ముందు ఇరుదుచుట్రు, విక్రమ్వేదా, తమిళ్ పడం – 2 వంటి సక్సెస్ఫుల్ చిత్రాలను నిర్మించిన వైనాట్ స్టూడియోస్తో కలిసి రిలయన్స్ ఎంటర్టెయిన్మెంట్ సంస్థ నిర్మిస్తోంది.
చిన్న గ్యాప్ తరువాత నటి తాప్సీ తమిళంలో నటిస్తున్న చిత్రం ఇది. ఇంతకుముందు నయనతార నటించిన మాయ చిత్రాన్ని తెరకెక్కించిన అశ్విన్ సరవణన్ ఈ గేమ్ ఓవర్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. నిర్మాణంలో ఉండగానే ఈ చిత్ర హిందీ రీమేక్ హక్కులు హాట్కేక్లా అమ్ముడుపోయాయన్నది తాజా వార్త.
నటి నయనతార ప్రధాన పాత్రలో నటించిన ఇమైకా నొడిగళ్ చిత్రం ద్వారా నటుడిగా కోలీవుడ్కు ఎంట్రీ ఇచ్చిన ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ సొంతం చేసుకున్నారు. ఈ విషయాన్ని గేమ్ ఓవర్ చిత్ర నిర్మాతలు స్వయంగా వెల్లడించారు. ఇందులో నటి తాప్సీ కొత్తకొత్త గేమ్లను రూపొందించే వైవిధ్యభరిత కథా పాత్రలో నటిస్తోంది. మరో విశేషం ఏమిటంటే ఈ చిత్రం నిర్మాణంలో తనూ భాగస్వామి అవడం. నటి వినోదిని వైద్యనాథన్, అనీశ్ కురువిల్లా ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి రాన్ ఇదన్ యోహన్ సంగీతాన్ని, ఏ.వసంత్ ఛాయాగ్రహణం అందించారు. హిందీ రీమేక్లో నటి తాప్సీనే నటిస్తుందా లేక వేరే నటిని నటింపజేస్తారా అన్నది తెలియాలంటే కాస్త వేచి చూడాలి.