ఘాజీ అవార్డుపై తాప్సీ హర్షం

13 Apr, 2018 20:24 IST|Sakshi

కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించిన 65వ జాతీయ చలనచిత్ర అవార్డులో జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా దగ్గుబాటి రానా నటించిన ‘ఘాజీ’  చిత్రం ఎంపికైంది. 1971 నాటి భారత్ పాక్ యుద్ధ నేపథ్యంలో సంకల్ప్ రెడ్డి రూపొందించిన ఘాజీ సినిమా సక్సెస్ సాధించటమే కాదు.. విశ్లేషకుల ప్రశంసలనూ అందుకుంది. సబ్‌ మెరైన్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రంలో రానాతో పాటు తాప్సీ, అతుల్‌ కులకర్ణి ప్రధాన పాత్రల్లో నటించారు. తాను నటించిన ఘాజీ మూవీకి అవార్డు రావడంపై హీరోయిన్‌ తాప్సీ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

‘ఘాజీ సినిమాలో నటించినందుకు గర్వపడుతున్నాను. ఈ చిత్రానికి పనిచేసిన వారందరికీ శుభాకాంక్షలు. ఇప్పటి వరకు నేను నటించిన మూడు చిత్రాలకు(ఆడుకాలం, పింక్, ఘాజీ‌) జాతీయ అవార్డులు రావడం సంతోషం కలిగిస్తుంది. భవిష్యత్తులో ఇలాంటివి మరిన్ని వస్తాయని ఆశిస్తున్నాను’  అని ట్వీట్‌ చేశారు. ఘాజీలో చేసింది ప్రత్యేక పాత్రే అయినా.. వ్యక్తిగతంగా ఎంతో సంతృప్తినిచ్చిన పాత్ర అని తాప్సీ అన్నారు.

మరిన్ని వార్తలు