శభాష్‌ మిథు

4 Dec, 2019 00:02 IST|Sakshi

వెండితెరపై కొత్త ఆట ఆడటానికి రెడీ అయిపోయారు కథానాయిక తాప్సీ. ‘శభాష్‌ మిథు’లో క్రికెటర్‌గా కనిపించబోతున్నారామె. ప్రముఖ మహిళా క్రికెటర్‌ మిథాలీ రాజ్‌ బయోపిక్‌ ఇది. ఈ చిత్రానికి రాహుల్‌ థోలాకియా దర్శకుడు. ‘కహానీ’ (2012), ‘క్వీన్‌’ (2014), ‘మేరీకోమ్‌’ (2014), ‘పద్మావత్‌’ (2018) వంటి ఉమెన్‌ సెంట్రిక్‌ ఫిల్మ్స్‌ తీసిన వయాకామ్‌ 18 సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది. మంగళవారం మిథాలీ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను ప్రకటించడం విశేషం. ‘‘కలలను సాకారం చేసుకోవాలనుకునే యువతులకు నా సినిమా ఓ స్ఫూర్తిగా నిలుస్తుందన్న నమ్మకం ఉంది’’ అని పేర్కొన్నారు మిథాలీరాజ్‌. ‘‘మిథాలీ.. నీ పుట్టినరోజుకి ఏం బహుమతి ఇవ్వాలో అర్థం కావడం లేదు.

వెండితెరపై నాలో నువ్వు ప్రతిబింబించేలా ప్రయత్నిస్తానని ప్రామిస్‌ చేస్తున్నాను. కవర్‌ డ్రైవ్‌ నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను’’ అన్నారు తాప్సీ. ఈ సంగతి ఇలా ఉంచితే... ‘సూర్మ’ (2017)లో హాకీ ప్లేయర్‌గా, సాంద్‌ కీ ఆంఖ్‌ (2019) సినిమాలో షూటర్‌గా నటించిన తాప్సీ తాజాగా ‘రష్మీ: ద రాకెట్‌’లో అథ్లెట్‌ (రన్నింగ్‌)గా నటిస్తున్నారు. ఇప్పుడు ‘శభాష్‌ మిథు’ సినిమా కోసం ఆమె క్రికెటర్‌గా మారారు. ఇవన్నీ గమనిస్తుంటే బాలీవుడ్‌లో స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌ మూవీ అంటే తాప్సీనే చేయాలని దర్శక–నిర్మాతలు భావిస్తున్నట్లు అనిపిస్తోంది కదూ.

మరిన్ని వార్తలు