నా రెమ్యూనరేషన్‌ పెంచేశాను కానీ.. : తాప్సీ

13 Oct, 2019 13:16 IST|Sakshi

తన నటనతో ఆకట్టుకుంటూ వరుసగా హిట్లతో బాలీవుడ్‌, కోలివుడ్‌లో దూసుకుపోతుంది అందాల భామ తాప్సీ. లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలతో నటిస్తూ వరుస విజయాలతో స్టార్‌ హీరోయిన్‌గా మారిపోయింది. తాజాగా హర్యానాకు చెందిన ప్రముఖ షూటింగ్‌ సిస్టర్స్‌ చంద్రో, ప్రకాశీల జీవిత కథ ఆధారంగా ‘సాండ్‌ కి ఆంఖ్‌’  చిత్రంలో నటిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, ట్రైలర్‌తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వరస హిట్లు రావడంతో తన రెమ్యూనరేషన్‌ భారీగా పెంచిందని బాలీవుడ్‌లో చర్చ జరుగుతోంది. దీనిపై తాప్సి తాజాగా స్పందించింది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. గత రెండేళ్లలో తన పారితోషకం బారీగా పెరిగిందని.. అయితే తనతో పాటు నటిస్తున్న నటులతో పోలిస్తే అది చాలా తక్కువేనని చెప్పుకొచ్చింది.  

ఒకేసారి ఎక్కువగా సంపాదించేయాలనే కోరిక తనకు లేదని తెలిపింది. తాను తీసుకుంటున్న రెమ్యునరేషన్ పట్ల నిర్మాతలు సంతోషంగా ఉన్నారని చెప్పింది. రెమ్యునరేషన్ ను భారీగా పెంచేసి సినిమాను ఇబ్బందుల్లోకి నెట్టడం తనకు ఇష్టం లేదని తెలిపింది. ఒకప్పుడు సినిమా అవకాశాల కోసం ఇతరుల దయపై ఆధారపడేదాన్నని... ఇప్పుడు సినిమాలు తననే వెతుక్కుంటూ వచ్చేంత స్థాయికి చేరుకున్నానని చెప్పింది. 

సాండ్ కీ ఆంఖ్ చిత్రం దిపావళి కానుకగా విడుదల కానుంది. తుషార్‌ హీరానందని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ నిర్మించారు. ఈ చిత్రానికి రాజస్థాన్‌ ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇచ్చిన విషయం తెలిసిందే. 

>
మరిన్ని వార్తలు