విశాల్‌తో మొదటిసారి..

29 Apr, 2016 03:01 IST|Sakshi
విశాల్‌తో మొదటిసారి..

 బాహుబలి చిత్రం చాలా మందికి చాలా మేలు చేసింది. ముఖ్యంగా ఇక పనైపోయింది అనే ప్రచారం ముమ్మరంగా జరుగున్న నటి తమన్నాకు నటిగా పునర్జన్మ నిచ్చిందనే చెప్పాలి. ఆమె నట జీవితం బాహుబలికి ముందు ఆ తరువాత అని చెప్పుకునేంతగా మారి పోయింది. ప్రస్తుతం తమన్నా యమ బిజీ హీరోయిన్‌గా మారిపోయారు. ఇప్పుడు వరుసగా అవకాశాలు ఈ మిల్కీబ్యూటీ తలుపు తడుతున్నాయి. విశేషం ఏమిటంటే తెలుగుతో పాటు తమిళంలోనూ తను క్రేజీ కథానాయకి అయిపోయారు.ప్రస్తుతం తెలుగు,తమిళ్, హిందీ మొదలగు మూడు భాషల్లో నటిస్తూ పుల్‌జోష్‌లో ఉన్నారు.
 
 ఇటీవల ద్విభాషా చిత్రం ఊపిరితో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న తమన్నా ఇప్పుడు బాహుబలి-2, తమిళంలో విజయ్‌సేతుపతితో ధర్మదురై చిత్రాల్లో నటిస్తున్న తమన్నా హిందీలో ఒక చిత్రం చేస్తున్నారు. త్వరలో ఏఎల్.విజయ్ దర్శకత్వంలో అభినేత్రి అను త్రిభాషా చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. అజిత్ తాజా చిత్రంలోనూ తమన్నానే నాయకి అనే ప్రచారం జరుగుతోంది. తాజాగా మరో స్టార్ హీరో విశాల్‌తో రొమాన్స్ చేసే అవకాశం తమన్నాను వరించింది.
 
 ఇంతకు ముందు రోమియో జూలియట్ వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన నిర్మాత ఎస్.నందగోపాల్ ఈ క్రేజీ కాంబినేషన్‌లో చిత్రం నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనికి సురాజ్ దర్శకత్వం వహించనున్నారు. ఇంకో విశేషం ఏమిటంటే చాలా కాలంగా హీరో పాత్రలే చేస్తానంటూ మొండి పట్టుతో ఉన్న హాస్య నటుడు వడివేలు ఈ చిత్రంలో రీఎంట్రీ ఇవ్వనున్నారు. ఆయనతో పాటు సూరి, టాలీవుడ్ విలక్షణ నటుడు జగపతిబాబు, సంపత్ ముఖ్యపాత్రలు పోషించనున్నారు. వినోదం మేళవించిన కమర్షియల్ అంశాలతో తెరకెక్కనున్న ఈ చిత్రం మే నెల రెండో తేదీన చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుందని చిత్ర వర్గాలు వెల్లడించారు.