నా ఆలోచనలు మారాయి! 

25 Mar, 2020 13:08 IST|Sakshi

తన ఆలోచనలు మారాయి అంటోంది నటి తమన్నా. మొదట్లో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చినా, ఈ ముంబై అమ్మడిని నటిగా ఆదరించింది మాత్రం టాలీవుడ్, కోలీవుడ్‌నే అన్నది తెలిసిందే. నటిగా అన్ని రకాల పాత్రలను నటించేసిందనే చెప్పవచ్చు. అందాలారబోతతో ప్రారంభించి తరువాత నటిగా తానేమిటో నిరూపించుకుంది.  ముఖ్యంగా బాహుబలి చిత్రంలో అవంతిక పాత్రకు జీవం పోసి ప్రశంసలు అందుకుంది. అదేవిధంగా సైరా నరసింహారెడ్డి చిత్రంలో లక్ష్మీ పాత్రకు వన్నె తెచ్చింది. నటిగా దశాబ్దన్నర అనుభవాన్ని గడించింది. ప్రస్తుతం మూడు పదుల వయసును దాటింది. అయితే ప్రస్తుతం అవకాశాలు తగ్గి ఉండవచ్చుగానీ, తమన్నాతో జోష్‌ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. అది ఇటీవల సరిలేరు నీకెవ్వరూ చిత్రంలో నటించిన సింగిల్‌ సాంగ్‌లో స్పష్టంగా తెలుస్తుంది. అయితే మరీ అసలు అవకాశాలు లేక పోలేదు తెలుగులో సిటీమార్‌ అనే చిత్రం, హిందీలో బోల్‌ చుడియన్‌ చిత్రాల్లో నటిస్తూనే ఉంది.

ఇక చాలా కాలం క్రితం నటించిన దటీజ్‌ మహాలక్ష్మీ చిత్రం విడుదల కావలసి ఉంది. ఈలోగా మరిన్ని అవకాశాలు రావచ్చు. కాగా తన సినీ జీవితం గురించి తమన్నా ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ తాను సినిమాకు వచ్చిన కొత్తలో కావచ్చు, ఇప్పుడు కావచ్చు తీసుకునే నిర్ణయాలు కరెక్ట్‌గానే ఉంటాయి అని చెప్పింది. ఇంతకుముందు సినిమా ప్రపంచం సంతోషంగా ఉందంది. నటించడానికి వచ్చిన కొత్తలో ఏమైనా చేయాలనే ఆసక్తి ఉండేదని చెప్పింది. వయసలాంటిదని అంది. దీంతో వచ్చిన అవకాశాలన్నీ అంగీకరించి నటించేశానని చెప్పింది. అదీ తనకు మంచే అయ్యిందని చెప్పింది. ఆ చిత్రాలకు ప్రేక్షకుల మధ్య మంచి ఆదరణ లభించిందని అంది. ఇప్పుడు తాను పూర్తిగా పరిణితి చెందానని చాలా అనుభవం గడించానని అంది.

దీంతో ఆలోచనల్లోనూ మార్చు వచ్చిందని చెప్పింది. ఆ అనుభవం ఇప్పుడు నటించే పాత్రలకు చాలా ఉపయోగపడుతోందని పేర్కొంది. మరో విషయం ఏమిటంటే తానెప్పుడూ తప్పుడు నిర్ణయాలు తీసుకోలేదని అంది. కొత్తలోనూ మంచి చిత్రాలను ఎంపిక చేసుకుని నటించానని, ఇప్పుడూ అంతేనని తమన్నా చెప్పుకొచ్చింది. అంతా బాగానే ఉంది పెళ్లెప్పుడన్న ప్రశ్నకు బదులివ్వడం లేదీ అమ్మడు. ఇంకా నటించాల్సింది చాలా ఉందని మాట దాటేస్తోంది. ఇదీ తన అనుభవంలో ఒక భాగం ఏమో! 

మరిన్ని వార్తలు