సంపంగి చిందులు!

25 Sep, 2016 01:00 IST|Sakshi
సంపంగి చిందులు!

 ‘నా ఇంటి పేరు సిల్కూ.. నా ఒంటి రంగు మిల్కూ..’ అంటూ ‘అల్లుడు శీను’లో  ఓ ఐటమ్ సాంగులో ఆడిపాడిన తమన్నా, ఈసారి సంపంగిగా సందడి చేయనున్నారు. మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి తనయుడు నిఖిల్‌కుమార్ హీరోగా పరిచయమవుతున్న ‘జాగ్వార్’లో తమన్నా ఐటమ్ సాంగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ‘సంపంగి..’ అంటూ సాగే ఈ పాటను ఇటీవల చిత్రీకరించారు. దాంతో షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి.
 
  రాజమౌళి శిష్యుడు ఎ.మహదేవ్ దర్శకత్వంలో చన్నాంబిక ఫిలింస్ పతాకంపై 75 కోట్ల భారీ బడ్జెట్‌తో శ్రీమతి అనితా కుమారస్వామి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 6న విడుదల చేయాలనుకుంటున్నారు. సంపంగిగా తమన్నా, నిఖిల్ వేసిన స్టెప్స్ అదిరిపోయాయనీ, ఈ సాంగ్ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ అవుతుందని యూనిట్ సభ్యులు తెలిపారు. జగపతిబాబు, రఘుబాబు, బ్రహ్మానందం తదితరులు నటించిన ఈ చిత్రానికి కథ: విజయేంద్ర ప్రసాద్, కెమేరా: మనోజ్ పరమహంస, మ్యూజిక్; ఎస్.ఎస్.తమన్.