ఆ వార్తల్లో నిజం లేదు

18 Jan, 2018 04:49 IST|Sakshi

...అంటున్నారు మిల్కీ బూటీ తమన్నా. ఇంతకీ ఆ వార్త ఏంటనేగా మీ డౌట్‌. బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌  నటించిన ‘క్వీన్‌’ హిందీ సినిమాను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రీమేక్‌ చేస్తోన్న విషయం తెలిసిందే. తెలుగులోనూ ‘క్వీన్‌’ పేరుతో వస్తోన్న ఈ చిత్రంలో తమన్నా టైటిల్‌ రోల్‌ చేస్తుండగా నీలకంఠ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ ఆ మధ్య మొదలైంది. ఇంతవరకూ బాగానే ఉన్నా..  ‘క్వీన్‌’ చిత్రీకరణ లో నీలకంఠకూ, తమన్నాకు మధ్య మనస్పర్థలు వచ్చాయనీ, దాంతో నీలకంఠ ఆ సినిమా నుంచి తప్పుకున్నారనే వార్తలు ఫిల్మ్‌నగర్‌లో హల్‌చల్‌ చేయడంతో పాటు సోషల్‌ మీడియాలోనూ వైరల్‌గా మారాయి.

ఈ వార్తలు అటూ ఇటూ తిరిగి తెలుగు క్వీన్‌ చెవిన పడ్డట్టున్నాయి. అందుకే కాబోలు తాజాగా తమన్నా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. ‘‘నీలకంఠ సార్‌ అంటే నాకు చాలా గౌరవం. నేను ఆయనతో గొడవ పడ్డానని వస్తున్న వార్తల్లో నిజం లేదు. మా మధ్య ఎటువంటి మనస్పర్థలు లేవు. సినిమా నిర్మాణం విషయంలో నాకు, నా టీమ్‌కి కానీ ఎటువంటి అధికారం లేదు. పూర్తి అధికారం నిర్మాత మను కుమారన్‌దే. నాలుగు భాషల్లో ఏక కాలంలో రానున్న ‘క్వీన్‌’ మా అందరికీ ఓ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ లాంటిది. అందుకోసం యూనిట్‌ అంతా కష్టపడి పనిచేస్తోంది’’ అని సెలవిచ్చారు తమన్నా. అయితే.. ప్రస్తుతం ‘క్వీన్‌’ షూటింగ్‌ జరుగుతోందా? ఆగిపోయిందా? అనే క్లారిటీ ఇవ్వలేదు మిల్కీ బ్యూటీ.

మరిన్ని వార్తలు