హర్రర్‌ సినిమాతో మాలీవుడ్‌కి!

20 Aug, 2019 10:40 IST|Sakshi

కాస్త లేటైనా లేటెస్ట్‌గా మాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వనుంది మిల్కీబ్యూటీ తమన్నా. ఈ అమ్మడు ఐదో భాషలో తన అదృష్టాన్ని పరిక్షించుకోబోతోంది. తమన్నా పేరు చెప్పగానే ముందగా అభిమానులకు గుర్తుకొచ్చేది ఆమె గ్లామరస్‌ నటనే. ఈ మరాఠి ముద్దుగుమ్మ తన 15వ ఏటనే నటిగా తెరంగేట్రం చేసింది. ఇప్పుడీమె వయసు ముచ్చటగా మూడు పదులను టచ్‌ చేయబోతోంది.  నటిగా తన 14 ఏళ్ల కాలంలో  హిందీ, తెలుగు, తమిళం, కన్నడం భాషల్లో నటించేసింది.

ముఖ్యంగా తెలుగు, తమిళం భాషల్లో క్రేజీ నటిగా రాణించేస్తోంది. ఇటీవల నాగార్జునకు జంటగా నటించే అవకాశాన్ని చేజార్చుకుందనే ప్రసారం జోరుగా సాగింది. అయితే హిందీ, తమిళం, తెలుగు భాషల్లో నటిస్తూ బిజీగానే ఉందీ భామ. తెలుగులో చిరంజీవి, నయనతార జంటగా నటించిన సైరా నరసింహారెడ్డి చిత్రంలో కీలక పాత్రను తమన్న పోషించింది. ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది.

తను ప్రధాన పాత్రలో నటించిన దటీజ్‌ మహాలక్ష్మీ చిత్రం విడుదల కావాల్సి ఉంది. ప్రస్తుతం తమిళంలో విశాల్‌కు జంటగా సుందర్‌.సీ దర్శకత్వంలో యాక్షన్‌ అనే చిత్రంతో పాటు పెట్రోమాక్స్‌ అనే హీరోయిన్‌ ఓరియన్‌టెడ్‌ కథా చిత్రంలో నటిస్తోంది. ఇది హర్రర్, థ్రిల్లర్‌ కథాంశంతో కూడిన చిత్రంగా ఉంటుంది. కాగా ఇంతకు ముందు కూడా దేవి, దేవి 2 వంటి హర్రర్‌ ఇతి వృత్తాలతో కూడిన చిత్రాల్లో నటించింది.

ఈ విషయం గురించి ఎందుకు గుర్తు చేయాల్సి వచ్చిందంటే ఈ అమ్మడిని ఇటీవల హర్రర్‌ కథా చిత్రాలు ఎక్కువగా వరిస్తున్నాయి. తాజాగా మరో హర్రర్‌ కామెడీ చిత్రంలో నటించడానికి రెడీ అవుతోంది. అయితే మాలీవుడ్‌ ప్రేక్షకులను హర్రర్, కామెడీతో అలరించబోతోందన్నది తాజా సమాచారం. అవును మలయాళ చిత్రంలో తమన్న నటించబోతోంది.

ఇదే ఈ బ్యూటీ నటిస్తున్న ఐదో భాష చిత్రం. ఈ సినిమాకు ‘సెంట్రల్‌జైల్‌ ప్రీతమ్‌’ అనే టైటిల్‌ను నిర్ణయించారు. సంధ్యామోహన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది జైలులో జరిగే వినోదాత్మక హారర్‌ కథా చిత్రంగా ఉంటుందని తెలిసింది. మొత్తం మీద అలా కాస్త లేట్‌ అయినా లేటెస్ట్‌గా మాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తోంది ఈ బ్యూటీ. చూద్దాం అక్కడ ఈ అమ్మడి లక్‌ ఎలా ఉంటుందో.

మరిన్ని వార్తలు