మిల్కీ బ్యూటీ వేదాంతం

30 May, 2019 09:53 IST|Sakshi

నటి తమన్నా ఈ మధ్య వేదాంతం మాట్లాడుతున్నారు. కెరీర్‌ స్టార్టింగ్‌లో ఎక్కువగా గ్లామర్‌ పాత్రలకు మాత్రమే ఓటు వేశారు తమన్నా. కాగా నటిగా తనలోని ప్రతిభను నిరూపించుకునే అవకాశం కోసం చాలా కాలంగా ఎదురు చూసిన ఈ బ్యూటీకి బాహుబలి చిత్రం రూపంలో అలాంటి అవకాశం వచ్చింది. అందులో వీరనారి అవంతికగా అద్భుతంగా నటించి ప్రశంసలు అందుకున్నారు. నిజం చెప్పాలంటే ఆ తరువాత అలాంటి మరో అవకాశం తమన్నాకు ఇప్పటికీ రాలేదనే చెప్పాలి.

కాగా ఈ బ్యూటీ డాన్సింగ్‌స్టార్‌ ప్రభుదేవాతో నటించిన దేవి 2 చిత్రం శుక్రవారం తెరపైకి రానుంది. ప్రస్తుతం విశాల్‌కు జంటగా ఒక చిత్రంలో నటిస్తున్నారు. హిందిలోనూ ఒక చిత్రంలో నటిస్తోంది. అదే విధంగా తెలుగులో చిరంజీవి, నయనతార జంటగా నటిస్తున్న భారీ చారిత్రక కథా చిత్రం సైరా నరసింహారెడ్డి చిత్రంలో కీలక పాత్రను పోషిస్తున్నారు. ఇదీ నటనకు అవకాశం ఉన్న పాత్రనేనని ప్రచారంలో ఉంది.

అంతే కాదు ఈ సినిమాలో తమన్నా ఒక పాటలో అందాలారబోయనుందనే ప్రచారం హోరెత్తుతోంది. ఇలాంటి పరిస్ధితుల్లో ఈ మిల్కీబూటీ  వేదాంతం గురించి మాట్లాడుతున్నారు. తమిళం, తెలుగు, హిందీ అంటూ పలు భాషల్లో దశాబ్ధానికి పైగా నటిస్తున్న తమన్నా షూటింగ్‌ లేని సమయాల్లో పుస్తకాలను ఎక్కువగా చదువుతున్నారట. దీని గురించి ఇటీవల ఒక భేటీలో తెలుపుతూ పుస్తకాలు చదవడం అంటే తనకు చాలా ఆసక్తి అని చెప్పారు.

అందులోనే వేదాంత పుస్తకాలను అధికంగా చదువుతానని తెలిపారు. కాగా అంతటితో ఆగకుండా ఈ బ్యూటీ మంచి తత్వంలో కూడిన వ్యాఖ్యలను సామాజిక మాధ్యమాల్లో రోజుకొక్కటి చొప్పున పోస్ట్‌ చేస్తున్నారు. అయితే వాటిని అర్థం చేసుకోవడం అందరికీ సాధ్యం కాదట. కారణం తమన్న వేదాంతపు వ్యాఖ్యలు హిందీలో ఉంటున్నాయి.

కాబట్టి హిందీ భాష తెలిసిన వారే తమన్న తత్వాలను అర్థం చేసుకోగలుగుతారు. దీంతో ఎవరైనా తమన్నా వేదాంతపు వ్యాఖ్యలను తెలుగు, తమిళం భాషల్లోకి అనువదిస్తే బాగుంటుందని నెటిజన్లు అంటున్నారు. కొందరైతే తమన్నకిప్పుడే ఈ వేదాంతం గొడవ ఏమిటీ అని ప్రశ్నిస్తున్నారు. మరి దీనికి ఈ బ్యూటీ ఎలా రియాక్ట్‌ అవుతుందో చూడాలి.

మరిన్ని వార్తలు