తమన్నా ఏం అడిగింది?

26 Sep, 2016 10:11 IST|Sakshi

కమెడియన్ కపిల్ శర్మ నిర్వహించే షోలో పాల్గొన్నారంటే.. ఆ రోజంతా సెలబ్రిటీలు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంటూనే ఉంటారు. ఒక్క నిమిషం ఊపిరి పీల్చుకోడానికి కూడా ఖాళీ ఇవ్వకుండా కపిల్ నవ్విస్తూనే ఉంటాడు. అయినా మధ్యలో ఎలాగోలా ఖాళీ చేసుకుని తాము అడగాలనుకున్న విషయాలు కూడా సెలబ్రిటీలు అడిగేస్తారు. తాజాగా కపిల్ షోలో మిల్కీ బ్యూటీ తమన్నా, సోనూ సూద్, ప్రభుదేవా, అలీ అస్గర్ తదితరులు పాల్గొన్నారు. వీళ్లంతా కలిసి చేసిన తుటక్ తుటక్ తుటియా సినిమా ప్రమోషన్ కోసం అంతా వెళ్లారు.

ఇందులో చాలా సేపు నవ్వుతూనే ఉన్న తమన్నా.. ఆ తర్వాత కపిల్‌ను ఒక ప్రశ్న అడిగింది. నిజంగా ఏడాదికి 15 కోట్ల రూపాయల పన్ను కడుతున్నారా అని తమన్నాకు అనుమానం వచ్చింది. తాను ఇంత పన్ను కడుతున్నా కూడా బీఎంసీ అధికారులు తనను రూ 5 లక్షల లంచం అడిగారంటూ ట్వీట్ చేసి కపిల్ దుమారం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే.. కపిల్ శర్మను ఆట పట్టించడానికో ఏమో.. తమన్నా ఈ ప్రశ్నను మాత్రం తమిళంలో అడిగింది. అదేంటో అర్థం కాక బుర్ర గోక్కున్న కపిల్.. ప్రభుదేవాను బతిమాలి హిందీలో దాని అర్థం ఏంటో కనుక్కున్నాడు.

అయితే కపిల్ షోలో ఒక లోటు మాత్రం స్పష్టంగా కనిపించింది. కొంచెం దూరంగా జనాల మధ్యలో ప్రత్యేకంగా ఒక సింహాసనం లాంటి కుర్చీ వేసుకుని తనదైన స్టైల్లో పంజాబీ జోకులు వేస్తుండే నవజ్యోత్ సింగ్ సిద్ధూ మాత్రం ఈ షోలో లేడు. ఈమధ్య కాలంలో పంజాబ్ రాజకీయాల కోసం ఆయన పూర్తిసమయాన్ని కేటాయిస్తుంటంతో షో కొంచెం బోసిపోయినట్లు కనిపించింది. అయితే సిద్ధు పూర్తిగా ఈ షోను వదిలిపెట్టి వెళ్లలేదని, త్వరలోనే మళ్లీ వస్తారని నిర్మాతలు చెబుతున్నారు.