నా బలం నేనే!

7 Apr, 2019 12:03 IST|Sakshi

నా బలం నేనే అని అంటోంది నటి తమన్నా. ఇటీవల కోలీవుడ్‌లో చెప్పుకోదగ్గ సక్సెస్‌లు లేకపోయినా అవకాశాలు మాత్రం బ్రేక్‌ పడలేదీయమ్మడికి. ప్రభుదేవాతో జత కట్టిన దేవి–2 చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు రెడీ అవుతోంది. తెలుగులో చిరంజీవి, నయనతార జంటగా నటిస్తున్న సైరా నరసింహారెడ్డి చిత్ర నిర్మాణం చివరి దశకు చేరుకుంది. ఇక తమిళంలో విశాల్‌తో రెండు చిత్రాల్లో నటించడానికి ఒప్పందం చేసుకుంది. అందులో ఒకటి ఇటీవలే ప్రారంభమైంది.

హిందీలోనూ ఒక చిత్రంలో నటిస్తోంది. ఇలా నటిగా దశాబ్దంన్నర దాటినా బిజీగా ఉండడం సాధారణ విషయం కాదు. తన 15 ఏళ్ల సినీ అనుభవాన్ని గుర్తు చేసుకున్న ఈ మిల్కీబ్యూటీ.. వెండితెరపైనేకాదు షూటింగ్‌ సెట్‌లోనూ హుషారుగా ఉండడం తన నైజం అని పేర్కొంది. పనిలోనూ ఎనర్జీగా పూర్తి అంకిత భావంతో చేస్తానని చెప్పింది. తన బలం ఇదేనని అంది.

చేసే పని ఏదైనా ఫలితం గురించి ఆశించకుండా ఇష్టంగా చేయాలంది. అప్పుడే రాత్రులు షూటింగ్‌ చేసినా అలసట అనిపించదని చెప్పింది. ఇంకా చెప్పాలంటే తనకు తానే బలం అని పేర్కొంది. కెమెరా ముందు ప్రతిభను చాటాల్సింది తానేననే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఎలాంటి నెగిటివ్‌ థింగ్స్‌కు తన మనసులో స్థానం ఉండదని చెప్పింది. అందుకే ధైరంగా ఉండగలుగుతున్నానని అంది.

తాను 10వ తరగతి పూర్తి చేసి నటిగా రంగప్రవేశం చేశానని చెప్పింది. 15 ఏళ్ల సినీ జీవితంలో ఎన్నో అనుభవాలు పొందానని అంది. ప్రముఖ కథానాయకిగా రాణిస్తూ ఐటమ్‌ సాంగ్‌లకు అంగీకరించడం గురించి విమర్శిస్తున్నారని, అవకాశాలు లేకపోవడంతోనే అలాంటి పాటలకు సై అంటోందని రకరకాల ప్రచారం చేస్తున్నారని అంది. అయితే బాలీవుడ్‌లో ప్రముఖ హీరోయిన్లు సింగిల్‌ సాంగ్స్‌కు అభ్యంతరం చెప్పరని, తాను సింగల్‌ సాంగ్స్‌లో నటించడానికి కారణం డాన్స్‌ అంటే తనకు ఇష్టం అని తమన్నా చెప్పుకొ చ్చింది.

మరిన్ని వార్తలు