కట్టప్ప దొర అయ్యాడు!

14 Jun, 2016 02:19 IST|Sakshi
కట్టప్ప దొర అయ్యాడు!

‘బాహుబలి’ చిత్రంలోని కట్టప్ప పాత్రతో తమిళ నటుడు సత్యరాజ్ జాతీయ స్థాయిలో పాపులర్ అయ్యారు. ప్రస్తుతం ఆయన ఏ సినిమా ఫంక్షన్స్‌లో,  ఏ ఇతర కార్యక్రమాల్లో కనిపించినా ప్రేక్షకులందరూ ఆయన్ను ‘కట్టప్పా’ అని పిలుస్తున్నారు. ఇప్పుడాయన దొరగా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సత్యరాజ్ ప్రధాన పాత్రలో తమిళంలో తెరకెక్కిన ‘జాక్సన్ దురై’ చిత్రాన్ని ‘దొర’ పేరుతో రత్నా సెల్యులాయిడ్స్ పతాకంపై జక్కం జవహర్‌బాబు తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.

ధరణీధరన్ దర్శకత్వంలో రూపొందిన ఈ పీరియాడికల్ హారర్ ఎంటర్‌టైనర్‌లో సత్యరాజ్ తనయుడు శిబిరాజ్ హీరోగా నటించడం ఒక విశేషమయితే... మన తెలుగమ్మాయి బిందుమాధవి హీరోయిన్ కావడం మరో విశేషం. ఈ చిత్రం పాటలను ఈ నెల 21న, సినిమాను జులై 1న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ - ‘‘ప్రేక్షకులను ఆద్యంతం ఆసక్తికి గురి చేసే హారర్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన చిత్రమిది.

తెలుగు ప్రేక్షకులకు ఈ జోనర్ కొత్తగా ఉంటుంది. సిద్ధార్థ్ విపిన్ మంచి పాటలు అందించారు. వెన్నెలకంటి, చంద్రబోస్ చక్కటి సాహిత్యంతో పాటలు రాశారు. శశాంక్ వెన్నెలకంటి డైలాగులు హైలెట్. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో జులై 1న విడుదల చేస్తున్నాం’’ అని పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమేరా: యువరాజ్, నేపథ్య సంగీతం: చిన్నా.