45 రోజుల పాటు రాత్రింబవళ్లు పని చేశాను : యోగిబాబు

6 May, 2019 16:29 IST|Sakshi

ధర్మప్రభు చిత్రంలో యమధర్మరాజు కుమారుడిగా యోగిబాబు నటించారు. హాస్య చిత్రంగా రూపొందిన ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం చెన్నైలో జరిగింది. ఈ కార్యక్రమంలో నటుడు యోగి బాబు మాట్లాడుతూ.. ఈ చిత్రంలో ఇద్దరు కథానాయకులు ఉన్నారని, యమలోకంలో తాను, భూలోకంలో శ్యామ్‌ నటిస్తున్నట్లు తెలిపారు. తాను ముత్తుకుమార్‌ 15 ఏళ్లుగా స్నేహితులమని తెలిపారు. తాము లొల్లుసభా నుంచి వచ్చే తక్కువ ఆదాయంతో జీవిస్తూ వచ్చామని, కొన్ని రోజులు భోంచేయకుండా డాబాపై పడుకున్న సందర్భాలు ఉన్నాయని, అప్పట్లో అనుకున్న కథ ప్రస్తుతం చిత్రంగా రూపొందుతుందన్నారు.

యోగి బాబు ఈ చిత్రం గురించి మాట్లాడుతూ.. ‘చిత్రంలో నటిస్తారా, డేట్స్‌ దొరుకుతాయా’ అని ముత్తుకుమార్‌ ప్రశ్నించగానే వెంటనే ఒప్పుకున్నట్లు తెలిపారు. అదే సమయంలో గుర్కా చిత్రంలోనూ నటించేందుకు ఒప్పుకున్నానని, ఇద్దరు దర్శకులు స్నేహితులు కావడంతో 45 రోజుల పాటు నిద్రలేకుండా రాత్రింబవళ్లు నటిస్తూ వచ్చానన్నారు. తాను యముడి గెటప్‌లో అందంగా కనిపిస్తున్నానని నటి రేఖ తెలిపారని, ఇదే విషయాన్ని తానూ అనుభూతి చెందినట్లు పేర్కొన్నారు. కొన్ని సందర్భాల్లో తాను మాట్లాడే డైలాగ్స్‌ చూసి యూనిట్‌లో భయపడుతున్నారని, ఈ చిత్రం తన జీవితంలో మరచిపోనిదిగా మిగిలిపోతుందని అన్నారు.

తాను అధిక పారితోషికం తీసుకునే వ్యక్తిని కాదని నిర్మాతల కష్టసుఖాలు తనకు తెలుసన్నారు యోగిబాబు. బయటి వ్యక్తులు వ్యాపింపజేసే వదంతులు నమ్మవద్దని ఆయన అభిమానులను కోరారు.

మరిన్ని వార్తలు