గొలుసు దొంగల కథతో...

15 Feb, 2017 23:33 IST|Sakshi
గొలుసు దొంగల కథతో...

ప్రస్తుతం సిటీల్లో జరుగుతున్న గొలుసు దొంగతనాల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘మెట్రో’. శిరీష్, బాబీ సింహా, సేంద్రన్, నిషాంత్‌ ముఖ్య పాత్రల్లో ఆనంద కృష్ణన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తమిళంలో హిట్‌ అయింది. ఈ చిత్రాన్ని సురేశ్‌ కొండేటి సమర్పణలో ఆర్‌ 4 ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రజని రామ్‌ తాళ్లూరి ‘మెట్రో’ పేరుతో మార్చి 3న తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్‌ను హీరో శర్వానంద్‌ రిలీజ్‌ చేశారు.

 అనంతరం ఆయన మాట్లాడుతూ– ‘‘తమిళంలో ఘనవిజయం సాధించిన ఈ చిత్రం తెలుగులోనూ హిట్‌ అవ్వాలి.  యూనిట్‌కు మంచి పేరు, డబ్బులు తీసుకురావాలి’’ అన్నారు. సురేశ్‌ కొండేటి మాట్లాడుతూ– ‘‘హైదరాబాద్, విశాఖపట్నం వంటి మెట్రో నగరాల్లో గొలుసు దొంగతనాల వార్తలు వింటూనే ఉన్నాం. స్నాచర్లు గొలుసులు తెంచుకుపోవడం ఒక్కోసారి మహిళల ప్రాణాల మీదకు తెస్తోంది.

 ఇటువంటి వాస్తవ సంఘటనలను దర్శకుడు తెరపై చక్కగా ఆవిష్కరించారు. యువ గాయని గీతామాధురి మా చిత్రంలో నటిస్తుండటం విశేషం. ఏ.ఆర్‌. మురుగదాస్, గౌతమ్‌ మీనన్‌ వంటి ప్రముఖ దర్శకుల ప్రశంసలు పొందిన ఈ చిత్రం, తెలుగులోనూ హిట్‌ అవుతుందనే ధీమాతో ఉన్నాం’’ అన్నారు.