హీరోలపై తమిళ నిర్మాత సంచలన వ్యాఖ్యలు

25 Apr, 2018 21:00 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ప్రముఖ తమిళ నిర్మాత జ్ఞానవేల్‌ రాజ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళ సినిమాలో హీరోల దోపిడీ ఎక్కువగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తమిళంలో ఒక సినిమా వందకోట్ల రూపాయలు వసూలు చేస్తే అందులో రూ. 50 కోట్లు హీరోలే తీసుకుంటున్నారని వాపోయారు. కానీ తెలుగు హీరోలు ఇందుకు పూర్తిగా విరుద్ధంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఎంత పెద్ద స్టార్‌ హీరో అయినా చాలా తక్కువ రెమ్యునరేషన్‌ తీసుకుంటారని, రూ.15 కోట్లు ఇచ్చినా సినిమా చేస్తారని అన్నారు. కానీ తమిళ పరిశ్రమలో మాత్రం అంతుకు పూర్తి విరుద్ధంగా ఉందని, ఈ పద్దతి తమిళంలో ఎందుకు లేదంటూ ప్రశ్నించారు.

అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కుతున్న నాపేరు సూర్య చిత్రం తమిళ వెర్షన్‌ ప్రమోషన్లలో భాగంగా చెన్నైలో ప్రెస్‌మీట్‌ జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జ్ఞానవేల్‌ రాజ తన ఆవేదన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు, తమిళ హీరోల మద్య తేడాలను చెప్పే ప్రయత్నం చేశారు. తెలుగుహీరోల్లాగే తమిళ హీరోలు కూడా దారికి రాకపోతే తమిళ సినిమాలు మానేస్తానంటూ హెచ్చరించారు. తమిళ పరిశ్రమలో హీరోలకు, నిర్మాతలకు ఎప్పుడు కెమిస్ట్రీ కలవదని అన్నారు. తనకు హైదరాబాద్‌లో ఆఫీస్‌ ఉందని.. పూర్తిగా టాలీవుడ్‌ వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉన్నానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే చాలా నష్టపోయానని, ఇంకా తమిళ సినిమాలు చేసి చేతులు కాల్చుకోలేనని తేల్చి చెప్పారు. తెలుగు సినమాలు చాలా రిచ్‌గా ఉంటాయని అందుకే ఉత్తరాదిన వాటికి మంచి డిమాండ్‌ ఉందని జ్ఞానవేల్‌ రాజ వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు