సినిమా వాళ్ల భార్యలు అంత తేరగా దొరికారా?

10 Nov, 2017 18:26 IST|Sakshi

బీజేపీ ఎంపీపై తమ్మారెడ్డి మండిపాటు

సాక్షి, హైదరాబాద్‌ : ఎవరి మీద అయినా కోపం వస్తే వాళ్లను తిట్టాలి కానీ, నోరు ఉంది కదా ఏది పడితే అది వాగితే ఊరుకునే ప్రసక్తే లేదంటున్నారు సీనియర్‌ దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్‌. బీజేపీ ఎంపీ చింతామణి మాలవీయ.. సినిమా వాళ్ల భార్యలను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ్మారెడ్డి మాలవీయపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

నోరు ఉంది కదా అని వాగితే తాట తీస్తా అంటూ తన అఫీషియల్‌ యూట్యూబ్‌ పేజీలో ఆయనో వీడియో సందేశం ఉంచారు. అందులో మాలవీయపై ఓ రేంజ్‌లోనే ధ్వజమెత్తారు. ఎవరి మీదైనా కోపం వస్తే.. వాళ్లను మాత్రమే తిట్టాలి.. అంతేకానీ సినిమా వాళ్ల మహిళను కించపరుస్తూ మాట్లాడటం దారుణమని ఆయన అన్నారు. గతంలో కమల్‌ హాసన్‌ వైవాహిక జీవితం గురించి కూడా మాట్లాడారని.. వివాహాలు, విడాకులు దేశంలో ఇప్పుడు సర్వసాధారణమైపోయాయన్న ఆయన... కొత్త మొగుళ్లు.. కొత్త పెళ్లాళ్లు వస్తున్నారని చెప్పారు. బీజేపీలో కూడా అలాంటి నేతలు ఉన్నారన్న ఆయన.. తనకు సంస్కారం ఉంది కాబట్టే వారి పేర్లు ప్రస్తావించనని చెప్పారు.

‘‘ఇలాంటి వ్యాఖ్యలు క్షమించరాని నేరమని.. ఖండించకుండా ఊరుకోవటం కూడా చాలా కష్టం అన్నారు. సినిమా వాళ్ల భార్యలు ఊరికే దొరికారా? ఏమిటతని ఉద్దేశ్యం? నోటి కొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోవాలా? సమాజంపై ప్రభావం చూసే సినిమాను, వాళ్ల కుటుంబ సభ్యుల చులకనగా మాట్లాడే హక్కు అతనికేక్కడిది?’’ అని తమ్మారెడ్డి ప్రశ్నించారు. కోపం వస్తే చెప్పుతో కొడతామని మాలవీయ అన్నారని... అలాంటి పరిస్థితి వస్తే, మేము కూడా చెప్పు తీసుకుని కొట్టే పరిస్థితి వస్తుందని తమ్మారెడ్డి వారించారు. చేతిలో ప్రభుత్వం ఉందని.. ఏది పడితే అది చెయ్యొచ్చని అనుకుంటే సహించే ప్రసక్తే లేదన్నారు. అలాంటి పరిస్థితి వస్తే... సినిమా పరిశ్రమ అంతా ఏకమైతే ఎలా ఉంటుందో మీకూ తెలీదు. చూపించాల్సిన పరిస్థితి వస్తే చూపిస్తాం ఖబడ్దార్‌ అంటూ హెచ్చరించారు. 

"సినిమా తీసే వాళ్ల కుటుంబాల్లో మహిళలు ప్రతిరోజూ భర్తలను మార్చేస్తుంటారు. దుష్ట మనస్తత్వాలతో నన్ను చికాకు పెట్టే దర్శకులను చెప్పుతో కొడతాను..’ అంటూ ఉజ్జయిని ఎంపీ చింతామణి మాలవీయ తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు