ఏ పాత్ర చేయడానికైనా రెడీ

23 Nov, 2018 07:56 IST|Sakshi

‘‘నేను ఇండస్ట్రీకి నటుడిగానే పరిచయమయ్యా. హీరోగా రాలేదు. హీరోనా.. విలనా..? అన్నది ఆలోచించను. నాకు ఎగై్జటింగ్‌గా అనిపిస్తే ఏ పాత్ర చేయడానికైనా సిద్ధమే’’ అని హీరో తనీశ్‌ అన్నారు. తనీశ్, పరుచూరి రవి, ప్రియా సింగ్, పరుచూరి వెంకటేశ్వరరావు, పోసాని కృష్ణమురళి, షఫీ ముఖ్య పాత్రల్లో కార్తికేయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రంగు’. నల్లస్వామి సమర్పణలో ఎ.పద్మనాభ రెడ్డి, నల్ల అయ్యన్న నాయుడు నిర్మించిన ఈ సినిమా ఈ రోజు విడుదలవుతోంది.

తనీశ్‌ మాట్లాడుతూ– ‘‘ప్రతి మనిషిలో చాలా రంగులు, భావోద్వేగాలు ఉంటాయి. అందుకే ‘రంగు’ అని టైటిల్‌ పెట్టాం. విజయవాడకు చెందిన లారా (పవన్‌ కుమార్‌) అనే వ్యక్తి జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. ఇందులో లారా పాత్ర చేశా. కాలేజ్‌లో స్టేట్‌ ర్యాంకర్‌ అయిన లారాపై రౌడీషీటర్‌ అనే ముద్ర ఎలా పడింది. 27ఏళ్లకే ఆయన ఎందుకు చంపబడ్డారు? అనే విషయాలతో పాటు ఆయన గురించి ప్రజలకు తెలియని ఎన్నో అంశాలను ‘రంగు’లో చూపించాం. లారా కుటుంబ సభ్యులు తలెత్తుకుని తిరిగేలా ఈ సినిమా ఉంటుంది. చివరి 30 నిమిషాలు హైలైట్‌గా ఉంటుంది. కృష్ణవంశీగారి ‘నక్షత్రం’లో విలన్‌గా చేసినందుకు గర్వంగా ఉంది. ఆ సినిమా తర్వాత ఎవరూ విలన్‌ పాత్ర కోసం నన్ను సంప్రదించలేదు. హీరో పాత్ర కోసమే కథలు వినిపిస్తున్నారు’’ అన్నారు. 

మరిన్ని వార్తలు