నేనూ కూడా నెపోటిజం బాధితురాలినే! 

5 Jul, 2020 10:13 IST|Sakshi

చెన్నై : నేను బాధితురాలనే అంటోంది తాప్సీ. ఈ ఉత్తరాది భామ దక్షిణాదిలో మొదట కథానాయికగా పేరు తెచ్చుకుంది. ముఖ్యంగా తమిళంలో మొదటగా ఆడుగళం చిత్రంలో ధనుష్‌కు జంటగా పరిచయమైంది. ఆ చిత్రం విజయంతో తర్వాత ఇక్కడ కొన్ని చిత్రాల్లో నటించిన నటిగా పెద్దగా పేరు సంపాదించుకోలేక పోయింది. తెలుగులోనూ ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో తాప్సీ బాలీవుడ్‌ను నమ్ముకుంది. అక్కడ ఈ అమ్మడు నటించిన నామ్‌ షబానా, పింక్‌ వంటి చిత్రాలు సక్సెస్‌ అవడంతో బాలీవుడ్లో ప్రముఖ కథానాయికగా రాణిస్తోంది. ముఖ్యంగా నటనకు అవకాశం ఉన్న పాత్రలు ఈ అమ్మడిని వరించడం విశేషం. కాగా ఇప్పుడు అక్కడ నేపోటిజం అనే పదం చర్చనీయాంశంగా ట్రోల్‌ అవుతోంది.

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ ఆత్మహత్య ఘటన తరువాత దానికి తామూ బాధితులమే అంటూ చెప్పుకొని పలువురు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. అలా తాప్సీ కూడా బాధితురాలినే నని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొంది. దీని గురించే ఆమె తెలుపుతూ సినీ పరిశ్రమలో ప్రముఖుల వారసులుగా రంగప్రవేశం చేసిన వారికి పరిచయాలు ఎక్కువగా ఉంటాయని చెప్పింది. అలా వారికి సినిమాల్లో అవకాశాలు చాలా సులభంగా వస్తాయని అంది. అయితే ఏలాంటి సినీ నేపథ్యం లేని వాళ్లు ప్రముఖులతో పరిచయాలు అవడానికి చాలా కాలం పడుతుందని చెప్పింది. దీంతో దర్శకులు కూడా బయటి నుంచి వచ్చే వారికి అవకాశాలు కల్పించడం కంటే ప్రముఖుల వారసులతో చిత్రాలు చేయడానికే నటింపజేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతారని చెప్పింది. అలా మొదట్లో తాను పలు అవకాశాలను కోల్పోయినట్టు చెప్పింది. అప్పుడు తాను అనుభవించిన బాధ మాటల్లో చెప్పలేనని పేర్కొంది. ఇలాంటి బాధాకరమైన సంఘటనలకు ప్రేక్షకులు కూడా ఒక కారణమని ఆరోపించింది. సినిమా వారసులకు నటించిన చిత్రాలను చూడడానికి ప్రేక్షకులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారని, ఇతరులు వారి చిత్రాలను పట్టించుకోకపోవడం ఇందుకు కారణమని నటి తాప్సీ పేర్కొంది.   

మరిన్ని వార్తలు