ట్రాక్‌లోనే ఉంది

30 Jan, 2019 00:25 IST|Sakshi

తాప్సీ, భూమి ఫడ్నేకర్‌ ముఖ్య తారలుగా బాలీవుడ్‌లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇందులో తాప్సీ, భూమి గన్‌ షూటర్స్‌గా నటించనున్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన చంద్రో అండ్‌ ప్రకాషి తోమర్‌ అనే షార్ప్‌ షూటర్స్‌ జీవితాల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం. దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ ఈ చిత్రానికి నిర్మాత. అయితే అనురాగ్‌ కశ్యప్‌ ఆర్థికపరమైన ఇబ్బందుల కారణంగా ఈ సినిమా ఆగిపోయిందని బాలీవుడ్‌ మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ విషయం గురించి అనురాగ్‌ స్పందించారు.

‘‘ఈ సినిమా ఆగిపోయిందనే వార్తల్లో నిజం లేదు. రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది. వచ్చే నెల 10న షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం’’ అని అనురాగ్‌ ట్వీట్‌ చేశారు. ‘‘ఈ సినిమా గురించి నన్ను ఇప్పటివరకు చాలా మంది అడిగారు. నాకు తెలిసినంతవరకు ఈ సినిమా సరైన ట్రాక్‌లోనే ఉంది. త్వరలో మరిన్ని విషయాలు తెలుస్తాయి’’ అని తాప్సీ పేర్కొన్నారు. ప్రస్తుతం ‘మిషన్‌ మంగళ్‌’ సినిమాతో తాప్సీ, ‘పతీ పత్నీ ఔర్‌ ఓ’ చిత్రంతో భూమి బిజీ బిజీగా ఉన్నారు. 

మరిన్ని వార్తలు