టికెట్‌ రేట్ల పెంపుపై ప్రభుత్వం సీరియస్‌

8 May, 2019 13:19 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : గురువారం ప్రేక్షకుల ముందుకు రానున్న మహర్షి సినిమా కొత్త వివాదాన్ని తెర మీదకు తీసుకువచ్చింది. ఎక్స్‌ ట్రా షోస్‌తో పాటు టికెట్‌ రేట్లు పెంచుకునేందుకు అనుమతి లభించిందంటూ చిత్రయూనిట్ ప్రకటించటంపై తెలంగాణా ప్రభుత్వం సీరియస్‌ అయ్యింది. టికెట్‌ రేట్ల పెంపుకు ఎలాంటి అనుమతి ఇవ్వలేందటూ ప్రభుత్వం తేల్చి చెప్పింది.

ప్రభుత్వాన్ని సంప్రదించకుండానే చిత్రయూనిట్ టికెట్‌ రేట్ల పెంచడాన్ని అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. ఈ విషయంపై స్పం‍దించిన సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌... టికెట్ల ధరల పెంపుపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలి.. కానీ కోర్టు డైరెక్షన్ వల్ల నిన్న కొన్ని థియేటర్ యాజమాన్యాలు వాళ్లంతట వాళ్లే రేట్లు పెంచినట్లు తెలిసిందని చెప్పారు.

79 థియేటర్లు రేట్లు పెంచినట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది.. వారిపై చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతున్నామన్నారు. ఈ విషయంపై కోర్టులో పిటిషన్ వేస్తున్నట్టు తెలిపారు. సామాన్యులు కూడా సినిమా చూడాలి అంటే రేట్లు తక్కువ గానే ఉండాలన్నారు.

మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన మహర్షి సినిమాను దిల్ రాజు, అశ్వనీదత్‌, పీవీపీలు భారీ బడ్జెట్‌తో నిర్మించారు. వంశీ పైడిపల్లి దర్శకత్వలో తెరకెక్కిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించగా అల్లరి నరేష్‌ కీలక పాత్రలో నటించాడు. జగపతి బాబు మరోసారి స్టైలిష్ విలస్‌గా అలరించనున్నాడు.

మరిన్ని వార్తలు