నేను బాగానే ఉన్నాను: కృష్ణంరాజు

21 Nov, 2019 09:16 IST|Sakshi
కృష్ణంరాజుకు స్వీట్‌ తినిపిస్తున్న సతీమణి

సాక్షి, హైదరాబాద్‌‌: తాను కొద్దిరోజులుగా వైరల్‌ ఫీవర్‌తో బాధపడ్డానని, ఇప్పుడు పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు తెలిపారు. బుధవారం పెళ్లిరోజు సందర్భంగా కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి బంజారాహిల్స్‌లోని శ్రీవిజయగణపతి స్వామి దేవాలయంలో శతచండీ మహాయాగంలో పాల్గొన్నారు. మహాలక్ష్మిదేవికి విశేష పూజలు నిర్వహించారు.

అనంతరం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో కృష్ణంరాజు ‘సాక్షి’తో మాట్లాడుతూ జలుబు, దగ్గు, జ్వరం సాధారణంగా అందరికీ వస్తుంటాయని, అందులో భాగంగా తనకు కూడా ఫీవర్‌ వచ్చిందని, దీనిపై మీడియా తప్పుడు వార్తలు రాసిందని ఆవేదన వ్యక్తం చేశారు. వార్తలు రాసే ముందు ఓసారి తనను సంప్రదించి ఉంటే బాగుండేదన్నారు. గత నాలుగు రోజుల నుంచి చాలా మంది అభిమానులు ఫోన్‌ చేసి తన ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారని చెప్పారు. తాను బావున్నానని అందరికీ చెప్పానన్నారు. తనను ఆశీర్వదించిన వారందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెబుతున్నానని కృష్ణంరాజు అన్నారు. 

మరిన్ని వార్తలు